హసన్పర్తి, జూలై 31: యాదవులు ఐక్యంగా ఉంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టులోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాలులో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ సన్మాన కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావులు ముఖ్యఅతిథిగా హాజరై సుందర్రాజ్ను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత యాదవుల అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు.
యాదవులను ప్రోత్సహించేలా 75 శాతం సబ్సిడీపై గొర్రెలను అందిస్తున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులు త్వరగా డీడీలు చెల్లిస్తే వారికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్గా, రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.
యాదవుల సంక్షేమ భవనం కోసం ప్రభుత్వం హైదరాబాద్ శివారులోని కోకాపేటలో రూ.300 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించిందని, భవన నిర్మాణం కోసం రూ.5 కోట్లు ఇచ్చిందన్నారు. అలాగే వరంగల్లో కూడా యాదవుల సంక్షేమ భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్.. సుందర్రాజ్ సేవలను గుర్తించి కుడా చైర్మన్ పదవిని కట్టబెట్టారన్నారు.
యాదవుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడాలేని విధంగా రూ.5 లక్షల కోట్లతో గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టారని తెలిపారు. ఇందులో గొల ్లకురుమలకు రూ.4 లక్షల యూనిట్లు (84 లక్షల గొర్రెలు) రెండేండ్ల కాలంలో అందజేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.