CM KCR | ‘ఎంత డబ్బుంటేనేం… ఒక్కరోజు మనిషి ఊపిరిని ఆపలేం కదా!’ అన్న ఆలోచన చాలాసార్లు వస్తుంది. కానీ, అవే డబ్బులు… కొన్నిసార్లు ఏండ్ల తరబడి మనిషి ప్రాణాన్ని నిలబెట్టగలవు. డయాలసిస్ రోగుల విషయంలో ఇది అక్షర సత్యం.
రెండు కిడ్నీలు ఫెయిల్… అన్నమాట వింటే పదేండ్ల క్రితం సాధారణ జనం ప్రాణాల మీద ఆశ వదులుకునేవారు. ఒక్క డయాలసిస్కే వేల రూపాయలు ఖర్చయ్యే చోట, వారానికి రెండు, మూడుసార్లు చేయించుకోవడం అన్నది… సంపన్నులు, ఎగువ మధ్యతరగతి వాళ్లకు తప్ప.. పేదవారికి కలలోని మాట. కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ప్రతి పేద రోగికీ ఉచితంగా డయాలసిస్ అందేలా రాష్ట్ర వ్యాప్తంగా 103 రక్తశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయించారు. ఉచిత బస్పాస్లతో పాటు, పింఛనూ ఇచ్చారు.
కేసీఆర్ తమకు ఏండ్ల ఆయుష్షును పోశారని అంటున్నారు ఇక్కడ డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చిన విజయ, కళావతి, మోహన్ రెడ్డి, అనిత, శంకర్, పరమేశ్వర్, సర్వేశ్… లాంటి కొందరు నిమ్స్ ప్రాంగణంలో కలుసుకున్నారు. వాళ్లు తమ కోసం ప్రభుత్వం చేస్తున్న సాయం గురించి ఏం మాట్లాడుకున్నారో మీరూ చదవండి…
విజయ: మేం కిస్మత్పురలో ఉంటం. మా ఆయన తాపీ మేస్త్రీగా పనిచేస్తడు. నాకు అయిదేండ్ల కింద రెండు కిడ్నీలూ ఫెయిలయినయ్. అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటున్న. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాలన్నరు డాక్టర్లు. గవర్నమెంటు ఫ్రీగా చేస్తున్నది కాబట్టి బతుకుతున్న. లేకపోతే నేను ఏమయ్యేదాన్నో, నా బిడ్డలు ఏమైపోదురో అనిపిస్తుంటది!
పరమేశ్వర్: అవును, మా పరిస్థితి కూడా అంతేనమ్మా! ఏ రోజుకారోజు పొట్ట పోసుకునే మనలాంటోళ్లు గిన్ని పైసలు ఎక్కడ పెడ్తం. ఏండ్లకేండ్లు ఇంత వైద్యం ఎట్లా చేయించుకుంటం. కేసీఆర్ సర్కారు ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను ఇన్నేండ్లు బతకకనే పోదునేమో! అనుకోవడం కాదు, నిజంగా బతికి ఉండేవాడిని కాదు. మా తమ్ముడికి 2006లో ఇదే కిడ్నీ బీమారి వచ్చింది. అప్పటికప్పుడు డయాలసిస్ చేయిస్తేనే బతుకుతాడని డాక్టర్లు చెప్పిన్రు. మాది చిన్న కిరాణా దుకాణం. మావోడు బతకాలంటే వారానికే వేలకు వేలు కావాల్సొచ్చింది. ఏడ్నుంచి తేవాలి? అప్పూసొప్పూ చేసి, కొంచెం డబ్బు జమ చేసి కొన్ని రోజులు వైద్యం చేయించినం. తర్వాత మాకు చేతకాలేదు. పాతికేండ్లకే మా తమ్ముడు చచ్చిపోయాడు. వాణ్ని తలచుకున్నప్పుడల్లా ‘మా పేదరికం వల్లనే వాణ్ని దూరం చేసుకున్నం కదా’ అని బాధనిపిస్తది. అప్పటికి మన రాష్ట్రం రాలేదు. ఇన్ని వసతుల్లేవు. ఇట్ల ఉచితంగా డయాలసిస్ అప్పుడు ఎక్కడిది?
శంకర్: డబ్బులు తెచ్చిన బయట మోసం చేస్తరే అన్నా. మాది దేవరకొండ దగ్గర పోలేపల్లి. ఆర్టీసీలో కాంట్రాక్టు డ్రైవర్గా పనిచేసే వాణ్ని. మొన్న ఏప్రిల్లో సుస్తీ చేస్తే హైదరాబాద్లో ఒక ప్రైవేటు దవాఖానలో చూపించుకున్న. కిడ్నీలు పోయినయ్ అన్నరు. ఒక్క డయాలసిస్కు ముప్పై వేలు వసూలు చేశారు. పదిహేను రోజుల్లో అయిదు లక్షలు తీసుకొని, మూడు రోజుల కన్నా ఎక్కువ బతకడని చెప్పారు. నా భార్య.. వాళ్ల అన్నదమ్ముల దగ్గర అప్పుతెచ్చి అయిదు లక్షలు కట్టింది. ఇంక మాకు చేతకాక ఇంటికొచ్చేశాం. మా ఇంటి పక్క వాళ్లు చెబితే నిమ్స్లో చూపించుకుంటున్నాం. ఇక్కడ కిడ్నీ బయాప్సీ చేసి ఢిల్లీకి పంపించి రిపోర్టులు తెప్పించారు. డయాలసిస్ ఫ్రీగా చేస్తున్నరు. లేకపోతే నా ఇల్లూవాకిలీ అమ్ముకున్నా ఈ వైద్యం చేతనయ్యేది కాదు.
సర్వేశ్: మేం కూడా నెల రోజుల్లోనే ఏడు లక్షలు ఖర్చు పెట్టుకున్నం. అశ్వాపురం దగ్గర గొందిగూడెం నుంచి మా అబ్బాయికి చూపిద్దామని ఇక్కడికి వచ్చాం. పోయినసారి పెద్దగోదారి వచ్చినప్పుడు మా వాడికి డెంగ్యూ జరమొచ్చింది. జరం ఎక్కువై రెండు కిడ్నీలూ పోయాయి. వాడికి ఇరవై మూడేండ్లు. కన్నకొడుకు కండ్లముందు ఆగమైతుంటే కడుపు తరుక్కుపోయింది. పిల్లగాన్ని ఎట్లనన్న కాపాడుకోవాలని ఏడు లక్షలు ఖర్చు పెట్టినం. డబ్బులన్నీ అయిపోయినయ్. ఎట్లరా భగవంతుడా! అనుకున్నా. మా దగ్గరే గవర్నమెంట్ దవాఖానలో డయాలసిస్ చేస్తున్నరని తెలిసింది. అప్పటి నుంచి అక్కడే చూపిస్తున్నం. చేతిల నరం పోయిందని నిమ్స్లో చూపించుకోమంటే ఇక్కడికి వచ్చినం.
మోహన్ రెడ్డి: ఇగ ఈ రోగం వస్తే, అంతా తిరుగుడే అయితది. బస్సు కిరాయిలు మీద పడకుండా మనకు ఫ్రీగ బస్పాస్లు ఇచ్చిందిగా గవర్నమెంటు. అది చాలా మందికి మేలయ్యింది. పెన్షన్ డబ్బులు కూడా జర తిండికో, మందులకో అయితున్నయ్. ఇవి లేకపోతే ఇంకా కష్టమయితుండే!
విజయ: ఈసారి గూడా బీఆర్ఎస్ సర్కారు వస్తే పింఛను పెంచుతరంట. నేనయితే అదే వస్తే బాగుండు అనుకుంటున్న. అదొక్కటే కాదు, ఇంతకు ముందు నిమ్స్కు డయాలిసిస్ కోసం వస్తే నా వంతు వచ్చేసరికి మూడు రోజులు పట్టేది. అసలే పానం బాగలేక బాధతోని ఉండిగూడ, ఇక్కడ పడిగాపులు కాయాల్సొచ్చేది. ఇప్పుడు మిషన్లు చాలా వచ్చినయ్. టయానికొచ్చి, చేయించుకొని పోతున్నం. కిడ్నీలు గూడ చాలామందికి (ట్రాన్స్ప్లాంటేషన్) పెట్టిర్రు. నాక్కూడా పెడతరని పేరిచ్చిన.
పరమేశ్వర్: నాకయితే కేసీఆర్ సర్కారే ప్రాణం పోసింది. కాబట్టి మళ్లీ తప్పకుండా దానికే ఓటేస్త. సారే రావాలనీ, మనలాంటి చాలా మంది పేదలకు సాయంజేయాలనీ కోరుకుంటున్న. జై కేసీఆర్!
రాష్ట్రంలో మొత్తం డయాలసిస్ కేంద్రాలు 103
తొమ్మిదేండ్లలో ఉచిత సేవలు పొందిన రోగులు సుమారు 80 వేలు
రోగులకు ఆసరా రూ. 2,016 పింఛన్, ఉచిత బస్పాస్
ప్రతి సంవత్సరం జరుగుతున్న కిడ్నీ రీప్లాంటేషన్లు 150కి పైగా
… లక్ష్మీహరిత ఇంద్రగంటి, ఫొటోలు : వీరగోని రజనీకాంత్గౌడ్