MLC Kavitha | బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కృషితోనే తెలంగాణలో బంజారాల బతుకులు మారాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అఖిల భారత బంజారాల ఆధ్యాత్మిక గురువు, పౌరాదేవీ పీఠాధిపతి చంద్రశేఖర్ మహారాజ్ బుధవారం ఎమ్మెల్సీ కవిత నివాసానికి వచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయనను సన్మానించి.. ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చంద్రశేఖర్ మహారాజ్కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆశీర్వాదం తీసుకోవడం సంతోషంగా ఉందని, వారి ఆశీర్వాదాలు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని బంజారాల ఆశీస్సులు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ఉన్నాయని తెలిపారు.
బంజారాల అభివృద్ధికి సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. బంజారా బిడ్డల పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకున్నారని వివరించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్నా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించి కేసీఆర్ చరిత్ర సృష్టించారని స్పష్టం చేశారు. బంజారాలకు ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించామని, 3వేలకుపై తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే చంద్రవతి, హరిప్రియ నాయక్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాల్య నాయక్, రాంబల్ నాయక్, రామచంద్ర నాయక్, రూప్ సింగ్, పలువురు బంజారా కులపెద్దలు పాల్గొన్నారు.