Mallu Bhatti Vikramarka | మల్లు భట్టి విక్రమార్కను మధిర ప్రజలు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన పెద్ద పదవులు చేపడితే వాళ్లు పొంగిపోయారు. ఆయన రాష్ట్రస్థాయి నేతగా ఎదిగితే వాళ్లు సంబురపడ్డారు. సీఎంలకు మా ఎమ్మెల్యే సన్నిహితుడని, ఇక తమ సమస్యలు తీరినట్టేనని ఆశపడ్డారు. కానీ, వాళ్ల ఆశలు అడియాసలే అయ్యాయి. మధిర ప్రజల ఓట్లతో భట్టి స్థాయి పెరిగింది కానీ మధిర నియోజకవర్గానికి ఆయన వల్ల ఒరిగింది ఏమీ లేదు. కేసీఆర్ సర్కార్ వచ్చాకనే మధిరకు మంచిరోజులొచ్చాయి. ఈ పదేండ్లు నిధుల వరద పారింది. విపక్ష నేత అనే వివక్ష చూపకుండా మాడల్ నియోజకవర్గంగా మధిరను అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వం.
మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క 2009, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా భట్టికి పేరుండేది. ఈ సాన్నిహిత్యం వల్లనే ఆయన కాంగ్రెస్ హయాంలో చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ వంటి కీలక పదవులను చేపట్టారు. ఆ సమయంలో నిధులు తెచ్చి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఆయనకు మంచి అవకాశాలు ఉండేవి. కానీ, ఆయన ఆ పని చేయలేదు. ఫలితంగా కాంగ్రెస్ హయాంలో మధిర నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. తనను గెలిపిస్తే మధిరను మాడల్ నియోజకవర్గంగా చేస్తానని హామీ ఇవ్వడం భట్టికి అలవాటు. కానీ, కాంగ్రెస్ పాలనలో మధిర పట్టణాన్ని మున్సిపాలిటీ కూడా చేయలేకపోయారాయన. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మధిరకు మంచి రోజులొచ్చాయి. పెద్ద ఎత్తున నిధులొచ్చాయి. అభివృద్ధి పనులతో మధిర రూపురేఖలే మారిపోయాయి.
హామీలు ఇచ్చి మర్చిపోవడం, శంకుస్థాపనలు చేసి వదిలేయడం భట్టి విక్రమార్క ైస్టెల్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మధిర మండలంలో మడుపల్లి వద్ద లెదర్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించి వదిలేశారు. ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల వద్ద లెదర్ పార్క్ నిర్మిస్తానని భట్టి విక్రమార్క హామీ ఇచ్చి మరిచిపోయారు. మధిర నుంచి వంగవీడు, బోనకల్లు మీదుగా ముదిగొండ, కోదాడ వరకు 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చి సర్వే చేయించి వదిలేశారు. బోనకల్లు మండల కేంద్రాన్ని వ్యాపార హబ్గా మారుస్తానన్న భట్టి హామీ ప్రకటనకే పరిమితమైంది. ఎర్రుపాలెంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తానని మరిచిపోయారు. బోనకల్లులో ఎస్సీ, ఎస్టీ భూములను స్వాధీనం చేసుకొని ఇందిరా క్రాంతి పథకం ద్వారా పాల ఫ్యాక్టరీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి నిర్మాణాలు చేపట్టకుండానే వదిలేశారు. మధిరలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చి మరిచారు.
2014లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధిర నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మధిర పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చి, పట్టణ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు వెచ్చింది. రూ.5 కోట్లతో మధిర – అంబారుపేట చెరువు కట్ట అభివృద్ధి పనులు చేపట్టింది. రూ.5 కోట్లతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేసింది. రూ.34 కోట్లతో 100 పడకల దవాఖానను, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో కొత్త దవాఖానను నిర్మించింది. రూ.2.50 కోట్లతో ఇండోర్ స్టేడియం, మధిర, బోనకల్లు, ఎర్రుపాలెం మండలాల్లో మున్నేరుపై రూ.30 కోట్లతో చెక్డ్యాంలను నిర్మించింది. రూ.18 కోట్లతో 122 చెరువులను అభివృద్ధి చేసింది. రూ.23 కోట్లతో 90 పాఠశాలలను అభివృద్ధి చేసింది. మిషన్ భగీరథ కింద 76,400 ఇండ్లకు తాగునీరు అందిస్తున్నది. ఇటీవల సీఎం కేసీఆర్ మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.30 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు. దళితబంధు పథకాన్ని ప్రభుత్వం ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి 3,642 మందికి అందించింది.
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై మధిర నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా మధిర నియోజకవర్గం ఈ పదేండ్లలో అభివృద్ధి చెందిందనే భావన నియోజకవర్గ ప్రజల్లో ఉన్నది. మరోవైపు ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నియోజకవర్గంలో అందుబాటులో ఉండకుండా హైదరాబాద్కే పరిమితం అవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి చెక్కులు ఇచ్చేందుకు కూడా ఆయన సమయం ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీంతో క్రమంగా ఆయన పట్ల నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగింది. దీని ఫలితంగానే గత ఎన్నికల్లో ఆయన కేవలం 3,567 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఈ ఎన్నికల్లో ఆయనకు నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. అందుబాటులో ఉండే అభ్యర్థిని, అభివృద్ధి చేసి చూపిస్తున్న పార్టీని గెలిపించుకుంటామనే మాట మధిరలో వినిపిస్తున్నది.