ప్రభుత్వ విప్ బాల్క సుమన్
కమలాపూర్, ఆగస్టు 31: దళితబిడ్డలను ధనికులుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ స్పష్టంచేశారు. మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్లో దళితబంధు లబ్ధిదారులు కన్నూరుకు చెందిన కనకం రవీందర్కు ట్రాక్టర్, కమలాపూర్కు చెందిన మాట్ల సుభాష్కు సెంట్రింగ్ సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. దళితుల ఆర్థిక ఎదుగుదలతోనే సామాజిక వివక్ష తొలగుతుందని.. అందుకోసమే సీఎం కేసీఆర్ దళితబంధు తీసుకొచ్చారని చెప్పా రు. దళితబంధు పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దళితజాతి అభ్యున్నతి కోసం పోరాటం చేసిన మేధావులు, ఉద్యోగులు దళితబంధు విజయవంతం కోసం కలిసిరావాలన్నారు. దళితబిడ్డగా దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు అందజేయడం పూర్వజన్మ సుకృతమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, సర్పంచ్ విజయ, వైస్ ఎంపీపీ శైలజ తదితరులు పాల్గొన్నారు.