హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : అడవులు మన జాతీయ సంపద అని, అనాదిగా మన జీవన విధానంలో భాగంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అభివృద్ధి ఎంత సాధించినా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా..ప్రకృతి పరిరక్షణ మన ప్రాథమిక ధ్యేయంగా ఉండాలని సూచించారు. ఆదివారం అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అటవీ రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అటవీ అమరవీరుల ఆశయం సజీవంగా ఉండాలంటే ప్రభుత్వం తీసుకొన్న ‘జంగల్ బచావో.. జంగల్ బడావో’ అనే నినాదాన్ని చిత్తశుద్ధితో మనం అమలు చేయాలని, సమాజంలోని ప్రతిఒక్కరూ ఆ దిశగా ప్రతినబూనాలని ముఖ్యమంత్రి సందేశమిచ్చారు.
పర్యావరణ రక్షణకు అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. గత ఎనిమిదేండ్లుగా తెలంగాణకు హరితహారం ద్వారా చేపట్టిన అటవీ రక్షణ, పునరుద్ధరణ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. తెలంగాణ లక్ష్యంగా పెట్టుకొన్న 33 శాతం పచ్చదనాన్ని సాధించే దిశగా కంకణబద్ధులై పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ బృహత్ కార్యంలో భాగమైన ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అటవీ రక్ష ణ కోసం పనిచేసిన 21 మంది అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్నారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.