హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశంలో బ్యాంకు మోసాలన్నీ ప్రధాని నరేంద్రమోదీకి తెలిసే జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలన్నీ త్వరలో దేశం ముందు పెడుతానని స్పష్టంచేశారు. ‘బ్యాంకు లూటీల్లో మీ వాటా ఎంత?’ అని నేరుగా ప్రశ్నించారు. కేంద్రం ఎనిమిదేండ్లలో ఒక్క బ్యాంకు దొంగను కూడా ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోయిందని నిలదీశారు. ‘మోదీ నేను వ్యక్తిగతంగా అడుగటం లేదు. 140 కోట్ల మంది ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నా? జవాబు ఇవ్వండి.. దేశం వినాలనుకుంటున్నది’ అని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
బ్యాంకు దొంగలను ఎందుకు పట్టుకోరు?
బ్యాంకు లూటీలు పెద్ద కుంభకోణం. మోదీకి తెల్వకుంట లూటీ జరుగుతలేదు. మోదీ రాకముందు ఎన్పీఏ రూ.4 లక్షల కోట్లుండే. ఈయన ఏకంగా రూ.12 లక్షల కోట్లు ఇచ్చిండు. విచక్షణారహితంగా ఎందుకు ఇచ్చారు? మోదీ.. అందులో మీ వాటా ఎంత? దేశానికి చెప్పండి. పెగాసస్, బొగాససు పెట్టి మంది మీద బాగా గూఢచర్యం చేస్తరు కదా.. ఈ బ్యాంకు లుటేరాగాల్ల మీద ఎందుకు ట్యాపింగ్ పెట్టరు? ఈడీలు, సీబీఐలు, మీ సంస్థలు బ్యాంకు దొంగలను ఎందుకు పట్టుకుంటలేవు? లండన్లో ఉన్న దొంగలు వాళ్ల ఫ్రెండ్స్కు ఓపెన్గా.. ‘వాళ్లకు ఇచ్చేకాడికి ఇచ్చి వచ్చినం. ఇక్కడ పిక్నిక్ లెక్క ఉన్నది. మల్లా మోదీ గెలువంగనే ఇండియాకు వాపస్ పోతం’ అని చెప్తున్నరట! రైతులకు సబ్సిడీ ఇయ్యొద్దు, కరెంటు సబ్సిడీ ఇయ్యొద్దు, మీటర్లు పెట్టాలె, వీళ్లకు మాత్రం లక్షల కోట్లు దోచిపెట్టాల్నా? మీది మహత్తరమైన పరిపాలన అయితే బ్యాంకు దొంగతనాలను ఎందుకు అరికడుతలేరు? ఇటీవల దొరికిన ఒక బ్యాంకు దొంగ రూ.20 కోట్లు బీజేపీకి చందా ఇచ్చినట్టు తేలింది. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలె? మోదీనా, నిర్మలా సీతారామనా? విశ్వగురు అని చెప్పుకొంటున్నరు కదా! మీ ప్రతిష్ఠ, పలుకుబడిని ఉపయోగించి ఒక్కన్నైనా పట్టుకరారేంది? అమాయకులను పట్టుకొని కథలు పడుడు తప్ప ఏమీ చేతకాదు. విశ్వగురు అని ప్రచారం చేసుకునే విషగురువు మోదీ.
బ్లాక్మనీ డబుల్ అయింది
బ్లాక్ మనీ వాపస్ తెస్తా అన్నరు. ఇప్పుడు స్విస్ బ్యాంకుల్లో డబుల్ అయింది. పెగాసస్, సీబీఐ, ఈడీలు అందరూ ఏం చేస్తున్నరు? విదేశాల్లో బ్లాక్ మనీ దాచేటోళ్లను ఎందుకో అపుతలేరు? దీనికి బాధ్యులు ఎవరు? అందుకే అంటున్నం డబుల్ ఇంజిన్ కావాలని.. ఢిల్లీలో మాటలు చెప్పే ఇంజిన్ కాదు.. మంచిగా పనిచేసే ఇంజిన్ కావాలి. బీజేపీవాళ్లు ధర్మాన్ని రక్షించరు.. భక్షిస్తారు.
పీయూష్ గోయల్.. నీకేమన్నా తెలివున్నదా?
తెలంగాణలో రైతులు వడ్లు పండించిన్రు. వాటిని కొనాలని మూడు నెలల కిందట ఢిల్లీలో ధర్నా చేసినం కదా. పీయూష్ గోల్మాల్ అనేటోడు అప్పుడేమో.. ‘యాడ పెట్టుకోవాలె? మా దగ్గర గోదాములు లేవు’ అని మాట్లాడిండు. ఇప్పుడు ‘వరిని ప్రోత్సహించండి, ధాన్యం తక్కువైంది’ అని అంటున్నడు. నీకేమన్న తెలివున్నదా? జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ మీద అవగాహన, అంచనాలు ఉన్నయా? రాష్ట్రంలో లక్షల టన్నుల బియ్యం రైస్ మిల్లుల్లో మూలుగుతున్నది. అయినా కేంద్రం తీసుకోదు. తెలంగాణ గవర్నమెంట్ను సతాయించడానికి ఇదొక చిల్లర ప్రయత్నం. తెలంగాణలో జీఎస్డీపీకి వ్యవసాయ రంగం 21% కంట్రిబ్యూట్ చేస్తున్నది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇంత లేదు. భగవంతుని దయవల్ల మంచి వర్షాలు పడుతున్నయి. పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసుకున్నం. వాటి ఫలితాలు వచ్చినయి. 24 గంటలు కరంటు ఫ్రీగా ఇస్తున్నం. బ్రహ్మాండంగా పంటలు పండుతున్నయి. కొనుమంటే మాత్రం వాళ్లకు చేతకాదు.
డబుల్ ఇంజిన్ వస్తే ఇవన్నీ ఇస్తరా?
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలె అంటున్నరు. మీరు వస్తే రైతుబంధు, రైతుబీమా ఇస్తరా? మేం అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నం. ఇక్కడ దిక్కుమాలిన, చెత్త బీజేపీ కావాల్నా. ఉన్న అంగీలాగు ఊడగొట్టుకోవడానికా? తలసరి ఆదాయం తక్కువ చేసుకోవడానికా? జీఎస్డీపీ తక్కువ చేసుకోవడానికా? కరెంటు కోతలు, మంచినీళ్ల కోతలు తెచ్చుకోవడానికా? మీ పాలన ఎట్లుంటదో, మీ ఉద్దార్కం ఏందో పక్కనే ఉన్న కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో కనిపిస్తున్నది కదా.
కాంగ్రెస్తో బ్రెయిన్ డ్రెయిన్.. బీజేపీతో క్యాపిటల్ డ్రెయిన్
నాడు కాంగ్రెస్ అసమర్థ విధానాలతో దేశం బ్రెయిన్ డ్రెయిన్ అయిపోతే.. బీజేపీ అసమర్థ పాలనతో క్యాపిటల్ డ్రెయిన్ అవుతున్నది. బీజేపీ ప్రజాస్వామ్య విధ్వంసకాండ, అరాచక పాలన, మత పిచ్చి రాజకీయాలతో భవిష్యత్తు అగమ్యగోచరమై లక్షల కోట్ల పెట్టుబడులు విదేశాలకు తరలిపోతున్నాయి. ఫలితంగా దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయని రఘురాంరాజన్, అమర్త్యసేన్ లాంటి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అమర్థ్యసేన్, రఘురాం రాజన్నే వీళ్లు (బీజేపీ) బేకార్గాళ్లు అంటున్నారు. మోదీ విదేశాలు తిరిగి, గుప్పెడు మంది పెట్టుబడిదారులకు సేల్స్మ్యాన్గా పని చేసి, వారికి బిజినెస్ ఇప్పించారు. మేకిన్ ఇండియా అట్టర్ ఫ్లాప్. పిల్లలు ఆడుకొనే పతంగుల మాంజా, దీపావళి దీపంతలు, పటాకులు, దేవుడి బొమ్మలు, జాతీయ పతాకాలు అన్నీ చైనాలో తయారవుతున్నాయి. ఇవి తయారు చేయడం కూడా మనకు చేత కాదా? మన దేశ జాతీయ జెండాలు చైనా అమ్ముతదా? ఇదేనా మేకిన్ ఇండియా ప్రజెంటేషన్ మోదీజీ?
రాష్ట్ర అభివృద్ధి.. దేశాభివృద్ధిలో భాగమే
అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే రాష్ర్టాల ప్రగతిని ఆపకండి.. అది దేశ ప్రగతిని ఆపినట్టే అయితదని నీతిఆయోగ్ మీటింగ్ల్లో స్పష్టంగా చెప్పిన. అయినా తెలంగాణ గవర్నమెంట్ను సతాయిస్తున్నరు. కేరళకు చెందిన అంతర్జాతీయ గార్మెంట్ సంస్థ కిటెక్స్ 130-140 దేశాలకు వస్ర్తాలను ఎగుమతి చేస్తున్నది. వాళ్లు కేరళ బయట పరిశ్రమ పెడతాం అని ప్రకటిస్తే.. తెలంగాణలో పెట్టాలని పిలిచి, ప్రత్యేకంగా విమానం పంపి తీసుకొచ్చినం. వాళ్లు వరంగల్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనరు. తర్వాతి దశలో ‘విమానాశ్రయానికి దగ్గరగా శంషాబాద్ దగ్గర కొద్దిగా జాగా ఇస్తే కార్పొరేట్ ఆఫీస్ పెడుతా’ అని కంపెనీ ఎండీ అధికారులకు చెప్పిండు. రాష్ట్రంలోనే వరంగల్ రెండో పెద్ద నగరం. రైల్వే జంక్షన్ ఉన్నది. ఎయిర్పోర్టు డెవలప్ చేస్తున్నం. అది కొంత దెబ్బతిని ఉన్నది.. దాన్ని డెవలప్ చేయాలె అని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఈయనేమో షాబాద్ మండలంలో జాగా అడుగుతున్నడు.
ఈ విషయాన్ని అధికారులు నాకు చెప్తే.. ‘గొర్రె బలిస్తే గొల్లాయిన బలిసినట్టే అన్నట్టుగా.. రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కడ వచ్చినా మనదే. మన జీఎస్డీపీ పెరుగుతది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తయి’ అని చెప్పిన. రంగారెడ్డి జిల్లా మంత్రులను, అధికారులను పిలిచి మాట్లాడి జాగా ఇచ్చినం. ఆయన ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్, వరంగల్లో పునాదిరాయి వేసిండు. ఒక ప్రగతి రావాలంటే ఇలా కాంప్రమైజ్ కావాలె. నీతిఆయోగ్ మీటింగ్లో ఇదేమాట చెప్పిన. బీజేపీ పరిపాలనా? ఇంకొకరా? అని చూడొద్దు. దేశంలో ఏ మూలన వికాసం జరిగినా భారత వికాసమే కదా.. అని చెప్పిన. అయినా వాళ్లు వినకుండా పరిగెత్తే రాష్ర్టాల కాళ్లల్లో కట్టెలు పెడుతున్నరు.