హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారామచంద్రమూర్తి భక్తుడుగా, బలం, జ్ఞానం, వాక్చాతుర్యం అన్నీకలిసి, అరుదైన వ్యక్తిత్వం కలిగిన జ్ఞానిగా, హిందూ పురాణాలు హనుమంతుడిని కీర్తిస్తాయని కేసీఆర్ తెలిపారు. సంత్ తులసీదాస్ తన రామచరిత మానస్లో చెప్పినట్టు అంజనీ సుతుడు “జ్ఞానినాం అగ్రగణ్యం”., అంటే జ్ఞానుల్లో అత్యున్నతుడు..అని కేసీఆర్ పేర్కొన్నారు. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు అన్నట్టు “న వాక్యదోషం… నచ అపశబ్దం”..అంటే., ఎటువంటి దోషాలు లేని భాషతో, ఉచ్చారణతో, వ్యాకరణం మీద పట్టుతో వాక్ శుద్ధితో ప్రసంగించే గొప్ప వక్త హనుమంతుడు అని కేసీఆర్ కొనియాడారు.
ధర్మ రక్షణ కోసం, తాను నమ్మిన శ్రీ రామునికి తన శక్తినంతా ధారపోసి, ఎటువంటి ప్రతి ఫలాపేక్ష లేకుండా, ప్రజా సంక్షేమం కోసం నాయకత్వాన్ని తన భుజాలమీద మోసిన బలశాలి, వినయానికి ,విజయానికి మార్గదర్శి, మృదుస్వభావి శ్రీ ఆంజనేయ స్వామి అని కేసీఆర్ కొనియాడారు. జ్ఞానం వాక్చాతుర్యం బలం భక్తి వినయం అన్నీ కలెగలిసిన సంపూర్ణ వ్యక్తిత్వం హనుమంతుడికే సాధ్యం అన్నారు. వారి ఆచరణ ఎల్లకాలం ఆదర్శనీయమని, నేటి యువతరానికి ఆచరణీయమని కేసీఆర్ తెలిపారు. ఆదర్శవంతమైన ఆలోచనలతో, దూరదృష్టితో, తమ జీవితాలను తీర్చిదిద్దుకునే శక్తిని హనుమంతుడు రాష్ట్ర ప్రజలకు అందించాలని, ప్రగతి తిరిగి పుంజుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని కేసీఆర్ ప్రార్ధించారు.