హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) యశోద దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నందీనగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. రొటీన్ హెల్త్ చెకప్లో భాగంగా గురువారం సాయంత్రం (ఈ నెల 3న) కేసీఆర్ యశోదా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం ఒకటి, రెండు రోజులు హాస్పిటల్లో చేరాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ఆరోగ్యపరంగా కేసీఆర్కు పెద్దగా ఇబ్బందులేమీ లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్షల అనంతరం శనివారం ఉదయం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
నీటి వాటాల సంగతి తేలుస్తా!
‘కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్దమైన నీటి వాటాపై నేను త్వరలోనే స్పందిస్త.. ప్రజల ముందు వాస్తవాలను పెడుత’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చేరిన కేసీఆర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శుక్రవారం తనను కలిసేందుకు వచ్చిన పార్టీ ముఖ్యనేతలతో మాట్లాడారు. ఉదయం, సాయంత్రం పార్టీ నేతలతో ముచ్చటించారు. దవాఖానలో ఉన్నా తనను కలవడానికి వచ్చిన నేతలతో రాష్ట్ర ప్రజలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపైనే ఆయన చర్చించడం గమనార్హం. ముఖ్యంగా రైతుల గురించి ఎక్కువ సమయం నేతలతో మాట్లాడారు.
పంటలెట్ల ఉన్నయి? వానలు పడుతున్నయా?
పలకరించేందుకు వచ్చిన నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో పంటలెట్ల ఉన్నయి? వానలు పడుతున్నాయా? నీళ్లు అందుతున్నాయా?’ అంటూ విచారించారు. యూరియా అందడం లేదని చాలాచోట్ల రైతులు చెప్తున్నారని పలువురు నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. అనేక ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం దాదాపు చేతులెత్తేసిందని నేతలు తమ తమ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల గురించి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడూ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి రాలేదని రైతులే చెప్తున్నారని, ఈసారి విత్తనాలు, ఎరువుల కొరత తీవ్రంగా ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని కొంత మంది నేతలు చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా గురించి ప్రభుత్వం చేస్తున్న వితండ, అర్థం, పర్థంలేని వాదన గురించి చర్చకు రాగా దీనిపై త్వరలోనే తాను స్పందిస్తానని, ప్రజల ముందు వాస్తవాలను పెడ్తానని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం, కొత్త రాష్ట్రం ఏర్పాటు.. తర్వాత ప్రభుత్వం ఎదుర్కొన్న సవాళ్లు వంటివాటిని నాయకుల వద్ద కేసీఆర్ గుర్తు చేశారు.