హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా నీటిని శుక్రవారం నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు లేకపోవడం వల్ల, వేసిన వరి పంట దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు ముఖ్యమంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో గురువారం సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
తెలంగాణ వాటా కింద కృష్ణా జలాల్లో మన వాటా నీటిని శుక్రవారం నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు విడుదల చేయాలని నిర్ణయించారు. మరో 20 రోజుల తర్వాత మరో తడి కోసం నీటిని విడుదల చేయనున్నట్టు సీఎం తెలిపారు. వానలు లేక సాగర్ రిజర్వాయర్లో ఆశించిన మేరకు నీటి నిల్వలు లేని కారణంగా, సాగునీటిని ఒడుపుగా, పొదుపుగా వాడుకొని వరి పంటను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి రైతాంగానికి పిలుపునిచ్చారు. సాగర్ ఎడమ కాలువ నీళ్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు తమ నియోజకవర్గాలలో పర్యవేక్షిస్తూ, రైతుల చివరి పొలాలకు, చివరి ఆయకట్టు దాకా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.