KCR | సిద్దిపేట రూరల్, మే12: సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామానికి సోమవారం గులాబీ దళపతి కేసీఆర్ దంపతులు రానున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఓటు హక్కును వారు వినియోగించుకోనున్నారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో కేసీఆర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామానికి సమీపంలోని హెలిప్యాడ్లో దిగి అక్కడి నుంచి కారులో వచ్చి ఓటు వేయనున్నారు.
పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిసారి చింతమడకలో కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్నారు. కేసీఆర్ రానుండటంతో పోలింగ్ కేంద్రానికి భారీగా ఓటర్లు తరలివచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ రాకకోసం గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.