BRS | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్ పని అయిపోంది.. అది ఇగ లేసుడు కష్టం’ అని సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్న ప్రచారాన్ని, ఆడుతున్న మైండ్గేమ్ను, జరుగుతున్న దుష్ప్రచారాన్ని చేవెళ్లసభ ద్వారా కేసీఆర్ తునాతునకలు చేశారు. బీఆర్ఎస్ పని అయిపోలేదని, సినిమా ముం దుందనే స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజల గొంతుకగా నిలబడతామని నిరూపించారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బహిరంగ సభ ద్వారా గులాబీ దళపతి శనివారం ఎన్నికల శంఖారావం పూరించారు. కాంగ్రెస్, బీజేపీకి అల్టిమేటం జారీచేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చేసిన మార్పు ప్రచార మాయావలలో చిక్కి తామేం కోల్పోయామో ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని, కొత్తవి ఇయ్యకపోయినా, ఉన్నవి ఊడగొడ్తిరి అనే ధర్మాగ్రహం ప్రజల్లో పెల్లుబుకుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగున్నర నెలల కాలంలో వచ్చిన ‘మార్పు’ పెనుముప్పుగా పరిణమిస్తున్న ఉదంతాలు అనేకం చోటుచేసుకున్నాయని, చేవెళ్ల బహిరంగ సభలో పాల్గొన్న జనాభిప్రాయం కూడా అదేనని చెప్పకనే చెప్పింది. ఒక్క చేవెళ్లలోనే కాదు, యావత్ రాష్ట్ర ప్రజల అభిప్రాయం అదేనని చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే మోసం జరిగిందని, ఈసారి అలా జరగకూడదన్న నిశ్చితాభిప్రాయంతో ప్రజలు ఉన్నారని స్పష్టమైనది. చేవెళ్లలో భూముల ధరలు పడిపోవడం, రియల్ ఎస్టేట్ మందగించడం, అభివృద్ధి ఆగిపోవడం, పరిశ్రమలు రాకపోవడం వంటి అంశాలు తమ ఆదాయ మార్గాలపై ప్రభావం చూపు తున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కరువు పరిస్థితులను అంచనా వేయలేని కాంగ్రెస్ అసమర్థతపై కేసీఆర్ సమరశంఖం పూరించారని, పార్లమెంట్ ఎన్నికల కోడ్పేరుతో ప్రభుత్వం తప్పించుకునే ఎత్తుగడపై కేసీఆర్ కత్తిదూశారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుకోచోట ఇష్టారీతిగా మాట్లాడి దొరికిపోతున్నారని, రైతుబంధు అడిగితే చెప్పుతో కొడ్తా అనడం, ఆదుకోమంటే అంతుచూస్తామని బెదిరించడం, ఉపాధి కల్పించాలన్న చేనేత కార్మికులను నిరోధ్లు అమ్ముకోవాలని అవమానించడం వంటి ఘటనలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని వారి మేలు కోసం కాకుండా ప్రతీకార రాజకీయాలకు వాడుకుంటున్నారన్న అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలా సుద్దులు చెప్పినట్టు ఉండదని, ముక్కుమీద గుద్దినట్టే ఉంటుందని కేసీఆర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని, అలా ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ తన పూర్వపు ఉద్యమ రూపాన్ని పునరావిష్కరణ చేసుకున్నదని తెలంగాణ సమాజం అభిప్రాయపడుతున్నది. అందులో చేవెళ్ల సభ తొలి అడుగు మాత్రమేనని అంటున్నది. ప్రభుత్వ దుష్ప్రచారానికి చేవెళ్ల సభ ద్వారా కేసీఆర్ చెక్పెట్టారని, సినిమా ముందుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అధికారం ఉన్నా, లేకున్నా తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమని చేవెళ్ల వేదికగా కేసీఆర్ విస్పష్టంగా చెప్పారు. నిజానికి చేవెళ్ల సభకు జనంరారని కాంగ్రెస్ కలలుగన్నది. నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థానిక నాయకులను కాంగ్రెస్ చేర్చుకోవడానికి ప్రయత్నించింది. మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతరత్రా నాయకులు వెళ్లినా కార్యకర్తలు తన వెంటే ఉన్నారని చేవెళ్ల సభ నిరూపించింది. తెలంగాణ ప్రజాబలం ముందు, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ ముందు ఎంతమందిపోయినా బీఆర్ఎస్ పార్టీకి ఏమీ కాదని తేలిపోయింది.
హైదరాబాద్ను ఆనుకుని ఉన్న చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్కు, కేసీఆర్కు ఇంత ఆదరణ ఉంటే, ఇక కరువు కోరల్లో చిక్కి అల్లల్లాడుతున్న గ్రామీణ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చని పరిశీలకులు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్పైనా, ఆయన కుటుంబంపైనా వ్యక్తిగత విమర్శలు చేసి ఓట్లు, సీట్లు సంపాదించారు కానీ, ఇంకా అవే మాటలు చెప్తే వినేందుకు జనం సిద్ధంగా లేరు. కాలు తొక్కిన నాడే కాపురం చేసే కళ తెలిసిపోతుంది అన్నట్టు కాంగ్రెస్ నాలుగున్నర నెలల పాలనను ప్రజలు చూశారు. కేంద్రంలో పదేండ్ల బీజేపీ పాలనను అనుభవించారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనకు, ప్రస్తుతం నడుస్తున్న కాలానికి పోలికపెట్టి చూస్తే కండ్ల ముందు కనిపించే వాస్తవాలను కనికట్టు చేయలేమని చెప్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయన్న నిజాన్ని చెప్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.