KCR | తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక పిలుపునిచ్చారు. రూ.2లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్, ఎండిన పంటలకు పరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్టుకార్డు ఉద్యమం చేపట్టాలన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు ఎన్ని మాటలు చెప్పారు. కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేసిండు కదా.. పోయి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని తెచ్చుకొనిమని చెప్పారా? డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని.. ఎదురైన ఆడపిల్లకు రూ.2500 ఇస్తం ఇలా ఎన్ని చెప్పారు ? ఒక్కమాటనన్న ఖాయమున్నదా? మరి ఏం జరగాలి ఈ రాష్ట్రం. ఇలాగే పోవాలా? నేను 15 సంవత్సరాలు కొట్లాడి.. చావునోట్లో తలకాయపెట్టి చచ్చేదాక తెగబడి ఈ రాష్ట్రం సాధించి పదేళ్లు బ్రహ్మాండంగా ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకున్నాం. రైతు సోదరులను కండ్లల్లో పెట్టుకొని కాపాడుకున్నాం’ అని కేసీఆర్ గుర్తు చేశారు.
‘ఓ పాలసీతో వ్యవసాయం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని.. రైతాంగాన్ని నిలబెట్టాలని అనేక మంచి స్కీమ్లు పెట్టినం. రైతుబంధు ఇవాళ్టి వరకు పూర్తి రైతులకు రాలేదు. పంటలు వచ్చినయ్ అవి కొనే దిక్కులేదు. కనీస మద్దతు ధర పోగా రూ.500 బోనస్ ఇస్తామన్నారు. బోనస్ బోగసేనా? బోనస్ వసూలు చేయాలా? ఈ ప్రభుత్వం మెడలు వంచాలా? వంచాలంటే కొట్టి వంచం.. మీ ఓటుద్వారానే వంచాలి. సిద్దిపేటోళ్లు మంచి దారి చూపించారు. హరీశ్ నాయకత్వంలో పోస్టుకార్డుల ఉద్యమం చేస్తున్నరు. ఇవాళ సంగారెడ్డి వేదిక నుంచి యావత్ రైతాంగానికి పిలుపునిస్తున్నా.. రూ.2లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని.. ఎండిపోయిన పంటలకు రూ.25వేలు ఎకరానికి పరిహారం ఇవ్వాలని.. బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని.. వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచి పోస్టుకార్డు ఉద్యమం మొదలుపెట్టాలి. సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని కోరుతున్నా’నన్నారు.
‘ఇవన్నీ చేయాలని అడిగితే.. ఒక మంత్రి రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతం అంటున్నడు. ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీస్తే.. ఈ లిల్లిపుట్గాళ్లు నీగుడ్లు పీకి గోళీలు ఆడుకుంటం.. నీ పేగులు తీసి మెడలో వేసుకుంటుం.. నిన్ను పండపెట్టి తొక్కుతుం.. నీ ముడ్డిమీద చెడ్డీలు లేకుంట చెడ్డీలు గుంజుకుంటం అంటున్నరు. నేను పదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారైనా ఇలాంటి మాటలు విన్నారా ? ఇంత అగౌరవంగా మాట్లాడామా? ఇంత అన్యాయం మీ కండ్ల ముందటే జరగాలా? దయచేసి ఆలోచించాలి. ఎలక్షన్లు అంటే ఆగమాగం ఓట్లు వేసుడుకాదు’ అన్నారు.