తిరుమలాయపాలెం, ఏప్రిల్ 29: లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం కోసం వరంగల్ నుంచి వస్తున్న పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఖమ్మం జిల్లా సరిహద్దు అయిన తిరుమలాయపాలెం మండలంలో సమీప ప్రాంతాల ప్రజలు సోమవారం రాత్రి ఘన స్వాగతం పలికారు. వరంగల్ ఖమ్మం హైవే మీదుగా ప్రత్యేక బస్సులో వెళ్తున్న గులాబీ దళపతికి రహదారి పొడవునా ఊరూరా ప్రజలు నీరాజనం పలికారు. ఈ సందర్భంగా అందరికీ నమస్కరిం చుకుంటూ, అభివాదం చేసుకుంటూ కేసీఆర్ ముందుకు సాగారు. మాదిరిపురం వద్ద పటాకులు కాల్చి, ప్రదర్శన చేసి వెల్కం చెప్పారు. కాగా, ఈ సందర్భంగా సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్ద కేసీఆర్ వాహన శ్రేణిని పోలీసులు తనిఖీ చేశారు.
కాగా, ఖమ్మం రూరల్ మండలంలోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఘన స్వాగతం లభించింది. ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని 28 గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు సొంత వాహనాలతో, కాలి నడకతో భారీ ప్రదర్శనంగా వచ్చి వరంగల్ క్రాస్రోడ్డు వద్ద గులాబీ దళపతికి ఎదురేగి స్వాగతం పలికారు.
రఘునాథపాలెం, ఏప్రిల్ 29 : ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో సోమవారం నిర్వహించిన బస్సుయాత్రకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. రోడ్ షోను విజయవంతం చేసేందుకు నగర పరిధిలోఅన్ని డివిజన్ల నుంచి పార్టీల నేతలు, కార్యకర్తలతో పెద్దసంఖ్యలో బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. కారు గుర్తుకే మన ఓటు అంటూ పెద్దఎత్తున కార్యకర్తలు చేసిన నినాదాలతో డివిజన్లు మారుమ్రోగాయి. ఖమ్మం నగరం పాండురంగాపురంలో డివిజన్ ఇన్చార్జిలు చిలుమూరి కోటి, యండీ ఫయాజ్, హెచ్ ప్రసాద్ ఆధ్వర్యంలో తరలివెళ్లారు. రఘునాథపాలెం మండలంలోని అన్ని గ్రామాల నుంచి వేలాదిగా ఆటోలు ద్వారా కార్యకర్తలు, మహిళలు భారీగా తరలారు. కేసీఆర్ను చూడాలని.. ఆయన ప్రసంగాన్ని స్వయంగా వినాలనే ఆసక్తితో స్వచ్ఛందంగా పయనమై వెళ్లారు.
కొణిజర్ల, ఏప్రిల్ 29: కేసీఆర్ ఖమ్మంలో జరిగిన రోడ్షోకు సోమవారం మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త లు భారీగా తరలివెళ్లారు. మండలం నుంచి ద్విచక్ర వాహనా లు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలు ర్యాలీగా బయల్దేరి వెళ్లా రు. జైకేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
మధిర, ఏప్రిల్ 29: పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఖమ్మం లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం కోసం ఖమ్మంలో సోమవారం చేపట్టిన కేసీఆర్ రోడ్షోకు మధిర నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బయలుదేరారు.