హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): నాడు సీఎంగా కేసీఆర్ హైదరాబాద్ నాంపల్లిలో ముస్లిం అనాథ పిల్లల కోసం నిర్మించిన అనీస్ ఉల్ గుర్భా భవనాన్ని నేడు ప్రైవేటు వ్యక్తులకు కారు చౌకగా కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తున్నదని బీఆర్ఎస్ నేత చిరుమల్ల రాకేశ్కుమార్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్వీ నేత తుంగ బాలుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 1,49,855 చదరపు అడుగుల స్థలంలో అనాథ పిల్లలు ఉండటానికి అనువుగా భవనం నిర్మించారని తెలిపారు. ఒక చదరపు అడుగు స్థలాన్ని రూ.5కే లీజుకు ఇవ్వడానికి నేడు రంగం సిద్ధమైందని ఆందోళన వ్యక్తం చేశారు.
మైనార్టీ విద్యాసంస్థలకు ఒక్కో చదరపు అడుగును రూ.30 అద్దె చెల్లిస్తున్నారని కానీ, అదే ప్రభుత్వం నిర్మించిన భవనాన్ని మాత్రం రూ.5కే ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. నిజాం కాలం నుంచి చారిత్రక నేపథ్యం కలిగిన అనీస్ ఉల్ గుర్భా భవనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వేరే అవసరాలకు వినియోగిస్తుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులకు అతి తక్కువ లీజుకు అప్పగించాలనే యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తవి కట్టకపోయినా, కేసీఆర్ కట్టినవి మాత్రం దొంగలపాలు చేయొద్దని రాకేశ్కుమార్ హితవు పలికారు.