KCR | కరీంనగర్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జగిత్యాల, నమస్తే తెలంగాణ: ఉద్యమాల పురిటిగడ్డ జగిత్యాల ఆదివారం రాత్రి జన జాతరగా మారింది. జగిత్యాల చౌరస్తా నుంచి చూస్తే ఎటుచూసినా జన ప్రభంజనమే కనిపించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జగిత్యాలలో ప్రజలు నీరాజనం పలికారు. దారి పొడవునా ఎదురేగి వెంట కదలివచ్చారు. కొత్త బస్టాండ్ పరిధిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రారంభమైన రోడ్షో శ్రీనివాస థియేటర్, అంగడి బజార్, తహసీల్ కార్యాలయం మీదు గా పాత బస్టాండ్ చౌరస్తాకు చేరుకున్నది.
మండుటెండను, ఉక్కపోతను సైతం లెక్క చేయకుండా కేసీఆర్ రాకకోసం గంటల తరబడి నిలబడ్డారు. బస్సులో నుంచి కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగగా.. సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్లతో ఆట్టహాసంగా రోడ్షో సాగింది. రోడ్షో అనంతరం జగిత్యాల చౌరస్తాలో బస్సుపైకి కేసీఆర్ చేరగానే ‘జై కేసీఆర్.. సీఎం కేసీఆర్’ అంటూ ప్రజలు పెద్దపెట్టున నినదించారు.
ఆలోచింపజేసిన కేసీఆర్ ప్రసంగం
జగిత్యాల రోడ్షోలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ప్రజలను ఆలోచింపజేసింది. గత ప్రభుత్వం చేసిన పనులు, ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న విషయాలపై బేరీజు వేసుకోవాలంటూ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంపై పలు ప్రశ్నలు అడిగారు. దీనికి ప్రజలనుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను రద్దు చేస్తామంటున్నది.. జగిత్యాల జిల్లా ఉండాలా? వద్దా? అంటే.. ఉండాలి.. ఉండాలి.. అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలకు రూ.2,500 వచ్చాయా? రాలేదా? అన్న పశ్నకు రాలేదు.. అటూ మహిళలు చేతులెత్తి అడ్డంగా ఊపారు. మీకు రెండు లక్షల రుణ మాఫీ జరిగిందా? లేదా? అంటే కాలేదు.. కాలేదు అంటూ రైతులు ముక్తకంఠంతో చెప్పారు.
రుణ మాఫీపై దేవుళ్లపై ఒట్టేసి చెపుతుండు.. ఇటువంటి ముఖ్యమంత్రిని నమ్మొచ్చా? అని కేసీఆర్ అడిగిందే తడవుగా.. నమ్మలేం.. నమ్మలేం.. అన్నీ మోసాలే జేస్తుండు అంటూ ప్రజల నుంచి సమాధానం వచ్చింది. రైతు భరోసా, రూ.500 బోనస్, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం గురించి అడిగినా రాలేదు.. అంటూ ప్రజలు పెద్ద ఎత్తున గొంతెత్తి చెప్పారు. గత ఎన్నికల్లో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచి ఏమైనా అభివృద్ధి చేశారా? అన్న ప్రశ్నకు లేదు.. లేదు అంటూ చెప్పారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు, గోదావరి నీటి తరలింపుపై, కాంగ్రెస్ మోసకారి విధానాలపై కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ను, కరీంనగర్ నుంచి వినోద్కుమార్ను, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కేసీఆర్ కోరగా, ప్రజలంతా చేతులెత్తి గెలిపిస్తాం.. అంటూ సంఘీభావం ప్రకటించారు.
దారుల వెంట బారులు తీరిన జనం
వీణవంకలో ఆత్మీయ సమ్మేళనం ముగిసిన తర్వాత జగిత్యాలలో జరిగే రోడ్షోకు బయలుదేరిన కేసీఆర్కు.. రోడ్డు పొడువున ఉన్న గ్రామాల ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. శంకరపట్నం మండలంలోని అముదాలపల్లి, ములంగూరు, కేశవపట్నం, తాడికల్ వద్ద కేసీఆర్ను చూసేందుకు జనం బారులు తీరి నిలబడ్డారు. మానకొండూరు మండల కేంద్రంతోపాటు గట్టు దుద్దెనపల్లి, చెంజర్ల, కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్, కమాన్, తెలంగాణచౌక్, కొత్తపల్లి వద్ద కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ బస్సు రాగానే.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయగా.. మహిళలు మంగళహారులతో స్వాగతం తెలిపారు.