KCR Bima | హైదరాబాద్ : తెలంగాణలోని ప్రతి కుటుంబానికి సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. రైతుబీమా తరహాలోనే కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా అనే పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా కేసీఆర్ తెలంగాణ భవన్లో ఈ వివరాలను వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమాకు మంచి స్పందన వస్తుంది. లక్షకు పైగా కుటుంబాలకు దినవారం వెళ్లకముందే రూ. 5 లక్షల చొప్పున వారికి అందాయి. చేనేత కార్మికులకు, గీత కార్మికులకు కూడా బీమా తెచ్చాం. ఈ క్రమంలోనే ఒక కొత్త స్కీం తెవాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఒక కోటి 10 లక్షల కుటుంబాలు ఉంటాయని అంచనా. ఈ కుటుంబాల్లో 93 లక్షలకు పై చిలుకు బీపీఎల్ కార్డులు ఇచ్చాం. వారందరూ కూడా బీపీఎల్ కింద పరిగణించబడుతారు. అర్హులైన తెల్లకార్డు కలిగిన పేద కుటుంబాలకు గెలిచిన తెల్లారి నుంచే 100కు 100 శాతం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి దీమా అనే పద్ధతుల్లో బీమా సదుపాయాలన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన బడ్జెట్ లెక్కలు తీయించాం. బీపీఎల్ కార్డు హోల్డర్స్ అందరికీ.. ఎల్ఐసీ ద్వారానే చేయించాలని నిర్ణయించుకున్నాం. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి దీమా.. దీని ద్వారా బీమా సౌకర్యం వస్తుంది. ప్రతి కుటుంబానికి రూ. 3600 నుంచి 4 వేల రూపాయాలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం వెనుకాడటం లేదు. ఐదు లక్షలు వచ్చే విధంగా రైతుబీమా తరహాలోనే ఉంటుంది. నాలుగైదు మాసాల్లోనే ప్రాసెస్ కంప్లీట్ చేసి, జూన్ నుంచి అమలు చేస్తాం. ఇది పాపులర్ స్కీం.. అన్ని కుటుంబాలకు రక్షణ కవచంలా ఉంటుంది అని కేసీఆర్ స్పష్టం చేశారు.