ఉద్యోగాల ప్రకటనతో బీజేపీ, కాంగ్రెస్ విలవిల
హైదరాబాద్, మార్చి 9 : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఒకేసారి 91,142 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించి విపక్షాల నోళ్లు మూయించారు. నిరుద్యోగ యువతను తమ వైపు తిప్పుకోవాలనుకొనే అవకాశవాద పార్టీలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కల్పించారు. ఆరేడు నెలల క్రితమే సాధ్యమైనంత త్వరలో 50 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్ అన్నంత పనిచేస్తారని గ్రహించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తమ వల్లనే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారని చెప్పుకోవటానికి ‘నిరుద్యోగ జంగ్సైరన్’ చేపడతామని ప్రకటించారు.
కాంగ్రెస్ కార్యాచరణకు పోటీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తామెక్కడ వెనుకబడిపోతామని గ్రహించి నిరుద్యోగ మార్చ్ చేపడతామని ప్రకటించారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను తమ రాజకీయ ప్రాపకానికి వాడుకుంటున్నాయని, బంగారు భవిష్యత్తు ఉన్న యువత ఆ పార్టీల మాయాజాలంలో పడకూడదని గ్రహించిన సీఎం కేసీఆర్.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు మెగా ప్రకటన చేసి ఆ పార్టీలను డైలమాలో పడేశారు. ఆ పార్టీలు తూచ్ తాము అన్న సంఖ్య అది కాదు.. అని కొత్తరాగం ఎత్తుకున్నాయి. ‘మేము చేసే పనిలో మా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు అనేక మంది ప్రయత్నించారు. వ్యక్తిగతంగా నన్ను కూడా నిందించారు. చిల్లరగాళ్లు అని వదిలిపెట్టినం. ఏనుగు పోతుంటే అవేవో మొరిగినట్టు పోనీ అని ఊరుకున్నం. మా ఏకాగ్రత దెబ్బతినకూడదు.. ప్రజలు ఫెయిల్ కావొద్దు అని మేం ముందుకు పోతూనే ఉన్నాం’ అని బుధవారం అసెంబ్లీలో ప్రకటించి ఈ రాష్ట్ర పాలనాధినేతగా హుందాగా చెప్పిన సీఎం కేసీఆర్ మరోసారి తెలంగాణ ఆర్తి తన దీపస్తంభం అని చాటిచెప్పారు.