హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ యంత్రాంగం సమష్ఠి తత్వం, సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి సమష్ఠి కృషికి నిదర్శనంగా నిలుస్తున్నదని తెలిపారు. స్వరాష్ట్రంలో ఒకొక రంగాన్ని తీర్చిదిద్దుకొంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టడంలో ప్రభుత్వ ఉద్యోగుల కృషి మరువలేనిదని పేర్కొన్నారు. సాధించినదానికి సంతృప్తి చెంది ఆగిపోకుండా ఇంకా గొప్పగా ఆలోచించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచడం, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధికార యంత్రాంగం ఏరోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించినప్పుడే గుణాత్మక ప్రగతి సాధ్యమని అన్నారు. ‘రోటీన్గా అందరూ పనిచేస్తారు. కానీ, గొప్పగా ఎట్లా పనిచేయాలనేదే ముఖ్యం. నిన్నటికంటే రేపు ఎంత మెరుగ్గా పని చేయగలమని ప్రతిరోజూ ఆలోచించాలి. ఒక పనిని ఎంత శాస్త్రీయంగా ఆలోచించి, రచించి, జీవించి చేస్తున్నం అనేదే ముఖ్యం. అప్పుడే ఉన్నతంగా ఎదగగలం. మూస ధోరణిని, సంప్రదాయ పద్ధతులను వీడి నూతన పద్ధతుల్లో ప్రజా సమస్యలను పరిషరించేందుకు మార్గాలు అన్వేషించాలి. అందుకు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి’ అని అధికారులకు సూచించారు.
తెలంగాణలో అన్ని వర్గాలు బలోపేతం
తెలంగాణలో నేడు అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా బలపడుతున్నారని సీఎం అన్నారు. ‘అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. రాష్ట్రంలో ఆర్థిక వనరులు, సంపదతోపాటే ప్రజావసరాలు కూడా పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన సౌకర్యాలు అందించేందుకు అందరం కలిసి పనిచేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో కనీస వసతులు లేని పరిస్థితి నుంచి నేడు అన్ని రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని తెలంగాణ సాధించింది. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు ప్రజల అనుభవంలోకి వచ్చాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతి సాధించింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. అన్ని వర్గాల ప్రజలు నేడు ఆర్థికంగా బలపడుతున్నారు. ప్రభుత్వాల నుంచి మరింత నాణ్యమైన సేవలు ఆశిస్తున్నారు. నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైనే ఉన్నది. సౌకర్యాల పెంపుకోసం డిమాండు పెరగటం మన ప్రభుత్వంపై ప్రజలకు పెరిగిన విశ్వాసానికి సూచిక. ఆ విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాలి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
30 లక్షల మంది వలసవచ్చి బతుకుతున్నరు
దేశంలోని అనేక ప్రాంతాల నుంచి దాదాపు 30 లక్షల మంది తెలంగాణకు వలస వచ్చి బతుకుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘ఒకనాడు ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ వ్యవస్థలు నేడు అత్యంత ప్రజాదరణతో రద్దీగా ఉంటున్నాయి. ఒకనాడు తెలంగాణ నుంచి బయటకు వలసలు ఉండేవి. నేడు ఇతర ప్రాంతాల నుంచి మనదగ్గరకు వలస వస్తున్నారు. దాదాపు 30 లక్షల మంది పక రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి బతుకుతున్నారు. స్వరాష్ట్రంలో ఆర్థిక వనరులు పెరిగాయి. పరిపాలనా సంసరణలతో గడప గడపకూ పాలనను తీసుకపోతున్నం. అన్ని శాఖల్లో పని పెరిగింది. ప్రజాకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి’ అని స్పష్టం చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాలను ఎంత సమర్ధంగా తీర్చగలమనేదే ప్రభుత్వ ఉద్యోగికి ప్రధాన కర్తవ్యం కావాలని సీఎం ఉద్ఘాటించారు. అన్ని రంగాలు వాటంతట అవే పనిచేసుకొంటూ పోయే స్థితికి తెచ్చామని చెప్పారు.‘గతంలో వానకాలం రెండుమూడు నెలలు మాత్రమే వుంటుండే. నేడు నిత్యం వానలు పడుతుండటంతో అభివృద్ధి పనుల కాలం తగ్గింది. వర్షాలు లేని ఆరేడు నెలల్లోనే అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి’ అని అధికారులకు సూచించారు.
నిజామాబాద్ను అద్భుతంగా తీర్చిదిద్దాలి
ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి ద్విగుణీకృతమై కండ్లకు కట్టేలా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. రెండున్నర నెలల్లో ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని స్పష్టంచేశారు. తాను అక్కడ పర్యటించి పనులను పరిశీలిస్తానని తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మున్సిపల్ తదితర అన్ని శాఖలను సమన్వయం చేసి పనులు పూర్తిచేయాలని స్థానిక ఎమ్మెల్యే గణేశ్ బిగాలను ఆదేశించారు. నిజామాబాద్ అభివృద్ధికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే మంజూరైన నిధులతోపాటు మరిన్ని నిధులను విడుదల చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శిని సమీక్ష సమావేశం నుంచే ఫోన్ చేసి ఆదేశించారు.
‘ఒకనాడు గందరగోళంగా ఉన్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరంగా మారింది. ఖమ్మంలాగానే నిజామాబాద్ను తీర్చిదిద్దాలి. అధికారులంతా కలిసి ఖమ్మం వెళ్లి అభివృద్ధిని పరిశీలించి రండి’
అని నిజామాబాద్ అధికారులు, ఎమ్మెల్యేకు సూచించారు. రోడ్ల నిడివిని అంచనా వేసి గ్రావెల్ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని ఆదేశించారు. స్మశాన వాటికలు, సమీకృత మారెట్లు, కమ్యూనిటీ హాళ్లు, డంప్ యార్డులు, వెజ్ – నాన్ వెజ్ మారెట్లు ఎన్ని అవసరమో గుర్తించి వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. పట్టణంలో సరిపడినన్ని మాడ్రన్ దోభీఘాట్లు, సెలూన్లను నిర్మించాలని తెలిపారు. పబ్లిక్ గార్డెన్లను తక్షణమే మెరుగుపరచాలని ఆదేశించారు. తాను చిన్నతనంలో తిలక్ గార్డెన్లో కూర్చొనేవాడినని కేసీఆర్ గుర్తుచేసుకొన్నారు. తిలక్ గార్డెన్ను పునరుద్ధరించాలని సూచించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను సుందరీకరించాలని కోరారు. నగరంలోని మొత్తం ప్రభుత్వ భూములెన్ని, వాటిల్లో ప్రజావసరాల కోసం వినియోగించుకొనేందుకు ఎన్ని అనువుగా వున్నాయో లెక్కలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం తర్వాత వివిధ శాఖలు ప్రస్తుత కార్యాలయాలను ఖాళీ చేశాయని, వాటిని ఇతర అవసరాల కోసం వాడుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
‘నేను రెండు నెలల్లో నిజామాబాద్ వస్త. మీరు చేసిన పనులను పరిశీలిస్త. అందమైన నిజామాబాద్ను ఆవిష్కరించాలి’ అని సీఎం స్పష్టంచేశారు. నగరంలో ఆడిటోరియం నిర్మాణ పనుల పురోగతిని సీఎంకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వివరించారు. నగరంలో బస్టాండ్, క్రీడా ప్రాంగణం నిర్మించేందుకు భూమి కేటాయించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. హజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని విన్నవించారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ఆ శాఖ మంత్రి కేటీఆర్ వివరించారు. సమావేశంలో మంత్రులు ఎమ్మెల్సీలు వెంకట్రామిరెడ్డి, కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు గణేశ్ బిగాల, జీవన్రెడ్డి, రోహిత్రెడ్డి, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ చిత్ర, నిజామాబాద్ జిల్లా పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, రెవెన్యూ, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.