కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలుచేసే విధంగా ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోవటంలేదు. మంచి చేయకపోయినా ఫర్వాలేదు, కానీ.. రైతులను మరింత నష్టపరిచే చర్యలకు కేంద్రం పూనుకొంటున్నది. ఇందులో భాగంగానే రైతులు పండించిన పంటలను కొనడం బంద్ చేసింది. బావులు, బోర్లకు కరెంటు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేయాలని ఆలోచిస్తున్నది. ఇప్పుడు తాజాగా ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరిచే కుట్ర చేస్తున్నది. వ్యవసాయరంగానికి సంబంధించి కేంద్రం తీసుకొంటున్న దుర్మార్గపు నిర్ణయాల వెనుక కుట్ర దాగి ఉన్నది. సాగురంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర సర్కారు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నది. తద్వారా రైతులను వారి సొంత పొలాల్లోనే కూలీలుగా మార్చేందుకు బీజేపీ సర్కారు కుట్రలు చేస్తున్నది – ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, జనవరి 12 : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలపై రైతులు నాగండ్లు ఎత్తి తిరుగబడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఎరువుల ధరల పెంపు నిర్ణయం రైతులకు శరాఘాతంగా మారుతుందని, దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రధానికి బహిరంగలేఖ కూడా రాశారు. అంతకుముందు బుధవారం ఉదయం అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశ రైతాంగాన్ని బతుకనిచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఎంతో కీలకమైన ఎరువుల ధరలు పెంచడం ద్వారా కేంద్ర సర్కారు పచ్చి రైతు వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకుంటే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కేంద్రం మెడలు వంచైనా సరే ధరలు తగ్గిస్తామని స్పష్టంచేశారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తమని గొప్పలు చెప్పిన బీజేపీ ఇప్పుడు ఉల్టా పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేస్తున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. అనాలోచితంగా ఎరువుల ధరలు పెంచడంతో రైతులపై పెట్టుబడి భారం పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలుచేసే విధంగా ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంచి చేయకపోయినా ఫర్వాలేదని, కానీ.. రైతులను మరింత నష్టపరిచే చర్యలకు కేంద్రం పూనుకొంటున్నదని మండిపడ్డారు. ఇందులో భాగంగానే రైతులు పండించిన పంటలను కొనడం బంద్ చేసిందని, బావులు, బోర్లకు కరెంటు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేయాలని ఆలోచిస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరిచే కుట్ర చేస్తున్నదని చెప్పారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయకుండా నాన్చడం వెనుక రైతులకు నష్టంచేయాలనే దురాలోచనే తప్ప మరొకటి లేదని తెలిపారు.
రైతులను కూలీలుగా మార్చే కుట్ర
వ్యవసాయరంగానికి సంబంధించి కేంద్రం తీసుకొంటున్న దుర్మార్గపు నిర్ణయాల వెనుక కుట్ర దాగి ఉన్నదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. సాగురంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర సర్కారు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఇందులో భాగంగానే వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నదన్నారు. తద్వారా రైతులను వారి సొంత పొలాల్లోనే కూలీలుగా మార్చేందుకు బీజేపీ సర్కారు కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నాగండ్లు ఎత్తి తిరగబడాలె
వ్యవసాయానికి సంబంధించి కేంద్రం తీసుకొంటున్న అనాలోచిత నిర్ణయాలపై పోరాటం చేయాల్సిందేనని దేశ రైతాంగానికి, ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తిచేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్న బీజేపీ, కేంద్రంపై దేశ రైతాంగం నాగండ్లు ఎత్తి తిరగబడాలని పిలుపునిచ్చారు. పోరాడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకోలేని పరిస్థితులు దేశంలో దాపురించాయని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రంపై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. బీజేపీ సర్కారుకు బుద్ధి వచ్చేవరకు ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ధరలు తగ్గించండి.. లేదంటే పోరాటమే
పెంచిన ఎరువుల ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ డిమాండ్చేశారు. లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆందోళన ద్వారా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి రైతులకు మేలు చేస్తామమని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను పసిగట్టాలని, కేంద్రంపై చేస్తున్న పోరాటంలో తమతో పాటు కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యవసాయరంగాన్ని కుదేలుచేసేలా పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. ఈ మేరకు మోదీకి ఒక లేఖ రాశారు.