BRS | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లోనైనా, పార్టీ నిర్మాణంలోనైనా సామాజిక సమతూకం పాటించేది బీఆర్ఎస్ పార్టీయేనని మరోసారి నిరూపితమైంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన 16 స్థానాల్లో కేసీఆర్ అన్ని వర్గాలకు అవకాశం కల్పించారు. బీసీలకు 5 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసే అవకాశాన్ని కల్పించారు. బీసీల్లోనూ మున్నూరుకాపులకు రెండు (జహీరాబాద్, నిజామాబాద్) పార్లమెంట్ స్థానాలు కేటాయించగా, చేవెళ్ల స్థానాన్ని ముదిరాజ్లకు, సికింద్రాబాద్ను గౌడ సామాజికవర్గానికి, భువనగిరి స్థానాన్ని యాదవులకు కేటాయించారు. మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్, మల్కాజిగిరి స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారు. వెలమ, కమ్మ సామాజిక వర్గానికి ఒక్కో సీటును కేటాయించారు. రిజర్వ్ స్థానాల్లోనూ సమాన అవకాశాలు కల్పించారు. ఎస్టీల్లో ఆదివాసీ, మైదాన గిరిజనులకు సమానంగా సీట్లు ఇచ్చారు.
ఆదిలాబాద్ స్థానాన్ని ఆదివాసీ (గోండు) గిరిజనులకు కేటాయించగా, మహబూబాబాద్ స్థానాన్ని మైదాన ప్రాంత గిరిజన (బంజారా/లంబాడా) గిరిజనులకు కేటాయించటం విశేషం. ఎస్సీ నియోజకవర్గాల్లో రెండు స్థానాలను మాదిగ (నాగర్కర్నూల్, వరంగల్)లకు, పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించారు. తాజాగా, శనివారం మూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారు. సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావుగౌడ్, భువనగిరి నుంచి పార్టీ సీనియర్ నేత క్యామ మల్లేశ్, నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పార్టీ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అందరి అభిప్రాయాలు తీసుకొని.. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడిగా ఉన్న పద్మారావుగౌడ్ను ఖరారు చేయగా, సభ్యులంతా ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. పద్మారావుగౌడ్ సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. నిబద్ధత కలిగిన స్థానిక నేత. బస్తీవాసులంతా ‘పజ్జన్న’ అని ప్రేమగా పిలుస్తారు. భువనగిరి, నల్గొండ పార్లమెంట్ నియోజకర్గాల నేతల అభిప్రాయాలను సేకరించిన కేసీఆర్.. భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నల్లగొండ స్థానం నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా, ఇప్పటి వరకు 16 స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. ఇక మిగిలింది హైదరాబాద్ ఎంపీ స్థానం ఒక్కటే. కాగా, భువనగిరి స్థానం నుంచి పోటీచేసే అవకాశం కల్పించినందుకు కేసీఆర్కు క్యామ మల్లేశ్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం తదితరులతో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.