హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దసరా కానుక ప్రకటించారు. సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధించిన లాభాల్లో 30% వాటాను సంస్థ ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించారు. ఇది గత ఏడాది ప్రకటించిన 29% కంటే 1% ఎక్కువ.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు చెల్లించాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో అర్హులైన కార్మికులకు రూ.368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనున్నది. ఈ మొత్తాన్ని దాదాపు 44 వేల మంది కార్మికులు, ఉద్యోగులకు అక్టోబర్ 1న చెల్లిస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. దసరా కానుక ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్కు కార్మికుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు
దసరా కానుక ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. బొగ్గు గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రం మనదేనని చెప్పారు.