హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ‘గుడ్డి లక్ష్మి వచ్చినట్టు అప్పుడప్పుడు రాజకీయాల్లో లిల్లీపుట్గాళ్లకు అధికారం వస్తుంది. ప్రజలు రాష్ర్టాన్ని బాగుచేయమని అధికారం ఇస్తారుగానీ అడ్డందిడ్డం పనులు చేయమని చెప్పరు’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ‘ప్రజా ఆశీర్వాద సభ’ మంగళవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో జరిగింది. సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ రాష్ట్రప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తిపోశారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ గొంతుక ఎంత ముఖ్యమో వివరించారు. కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లెందుకు.. సీట్లెందుకు? అని ఇయ్యాల ఇయ్యాల కొంత మంది తెలివిలేనివాళ్లు, అడ్డంపొడుగు మాట్లాడేవాళ్లు వాగుతున్నరు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయ్యిందంటే పాలిచ్చే బర్రెను ఎత్తేసి దున్నపోతును తెచ్చుకున్నట్టు అయ్యింది. రాజకీయాలల్లో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డిలక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీపుట్గాళ్లకు అధికారం వస్తది. ప్రజలు మాకు సేవ చేయాలని, రాష్ర్టాన్ని బాగు చేయాలని, గత ప్రభుత్వం కన్నా ఇంకా మంచి పనులు చేయమని అధికారం ఇస్తరు. అంతేగానీ అడ్డందిడ్డం పనులు చేయమని చెప్పరు.
మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం, మహనీయుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పెట్టినరు కాబట్టి, ఆయన పుణ్యమా అని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ మహనీయుడిని గౌరవించుకోవాలని, గుండెల్లో పెట్టుకోవాలని, ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 125 అడుగులు ఎత్తుండే అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నం. పోయిన ఏడాది బ్రహ్మాండంగా ఆవిష్కరణ చేసుకున్నం. విగ్రహం పెట్టిన తర్వాత తొలిసారిగా (సోమవారం) అంబేద్కర్ జయంతి వచ్చింది. ఈ లిల్లీపుట్గాళ్ల ప్రభుత్వం ఏం చేసింది? అక్కడికి గవర్నమెంట్ పోలేదు, హిమాలయ పర్వతమంత ఎత్తున్న ఆ మహనీయుడి విగ్రహానికి ఒక్క పువ్వు కూడా పెట్టలే. ఒక్క పూలమాల వెయ్యలే. అంజలి ఘటించలే. విగ్రహాన్ని చూడటానికి అనేక రాష్ర్టాల నుంచి ప్రజలు వచ్చారు. వాళ్లకు కనీసం మంచినీళ్లు ఏర్పాటు చేయలేదు. గేట్లు బంద్చేసి, తాళాలు వేశారు. దీనిని ఏమంటరు. అహంకారమా? కండకావరమా? అజ్ఞానమా? ఎవరు పెట్టినా విగ్రహం విగ్రహమే కదా. దళితబిడ్డలను అడుగుతున్న అంబేద్కర్ను అవమానిస్తే మౌనం పాటిద్దామా? దళితబంధును బంద్ పెడితే నోరు మూసుకొని పడుందామా? ఇయ్యాల ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్లకు సురుకు పెట్టాలె. బిడ్డా మీరు మోసం చేస్తే కింద పడగొడతం అని జవాబు చెప్పాలె.
ఒకప్పుడు ఇదే లిల్లీఫుట్ గాళ్ల పార్టీ మన నోరు కొట్టి, మనల్ని ఎండబెట్టి సింగూరు ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఇవ్వకుండా హైదరాబాద్కు తరలించినరు. బాధపడ్డం, ఏడ్చినం, పొలాలు ఎండిపోయినయి. అటు నిజామాబాద్ వాళ్లు, ఇటు మెదక్ వాళ్లు ధర్నాలు చేసినా నీళ్లు ఇయ్యలే. తెలంగాణ వచ్చినంక హరీశ్రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి జటాజటా కాలువలు తవ్వితే ఆందోల్కు నీళ్లు వచ్చినయి. పంటలు పండినయి. ఇయ్యాల ఈ లిల్లీపుట్ గాళ్లు ఏం చేస్తున్నరు? కాళేశ్వరం నీళ్లతో సింగూరుకు లింకు పెట్టుకున్నం కాబట్టి అటు నిజాం సాగర్గానీ, ఇటు మెదక్ జిల్లాగానీ మల్లన్న సాగర్తో కలుపుకున్నం కాబట్టి నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్కు తలా లక్ష ఎకరాలకు నీళ్లు వచ్చేటట్టు బ్రహ్మాండంగా సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్లు పెట్టుకున్నం. దాన్ని ఇప్పుడు ఎందుకు కోల్డ్స్టోరేజీలో పెట్టినరు? ప్రజలు ఆలోచించాలి. తొమ్మిదేండ్లళ్ల కన్నురెప్ప కొట్టేంతసేపైనా కరంటు పోయిందా? ఇయ్యాల పోతున్నదా? లేదా? మరి ఇట్లే పోవాల్నా? ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి.
నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగడానికి, తెలంగాణ రాష్ట్రం సాధించే పోరాట పటిమను నాకు అందించి, నన్ను పెంచింది ఈ మెతుకు సీమ. జిల్లా ప్రజలు ఇచ్చిన బలం వల్లనే ఢిల్లీతో కొట్లాడి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నం. ప్రజల దీవెనలు, అండదండలు, ఆశీర్వచనం లేకపోతే ఈ మెతుకుగడ్డ నీళ్లు, రక్తం నా శరీరంలో లేకపోతే నాకు ఈ స్థాయి వచ్చేదే కాదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హరీశ్రావు, ఇతరుల నాయకత్వంలో ఏ జిల్లాలో రానంత భారీ మెజార్టీ ఇచ్చి ఏడుమంది ఎమ్మెల్యేలను గెలిపించిన నా మెతుకుసీమ గడ్డకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను.
‘తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయు సోదరులను కోరుతున్నా. నాలుగు నెలలుగా ఏమవుతున్నదో ఆలోచించాలె. బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఎంత గౌరవం ఇచ్చిందో గుర్తు చేసుకోవాలె’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్లో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎంత జీతం ఇచ్చినం. ఎంత పెద్ద పీఆర్సీలు ఇచ్చినం. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఎట్లా ఇచ్చినం. ఇవన్నీ మీరు మర్చిపోయి ఆగమాగం, అడివడివి అయితమంటే మీరే నష్టపోతరు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. మీకు తెలివితేటలు, బుద్ధి, గౌరవం ఉన్నది కాబట్టి ఆలోచన చేసి చెక్ బ్యాలెన్స్ చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులను కోరుతున్నా. ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద్దు, నిలకడగా ఆలోచన చేయాలె, నిజానిజాలు తెలుసుకోవాలె, అప్పుడే సరైన న్యాయం జరుగుతది. మేధావులుగా ఆలోచించాలని, గవర్నమెంట్కు ముకుతాడు వేయాలని అప్పీల్ చేస్తున్నా’ అని కేసీఆర్ పేర్కొన్నారు.