KCR | నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలనపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరావు మండిపడ్డారు. నాగర్ కర్నూల్లో జరిగిన రోడ్షోలో కేసీఆర్ పాల్గొన్నారు. బీజేపీ పాలనపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో మరో పార్టీ పోటీ చేస్తుంది బీజేపీ. ఆ పార్టీ అక్కరకు రాసి సుట్టం. నరేంద్ర మోదీ నూరు నినాదాలు చెప్పిండు. బేటీ పడావో బేటీ బచావో ఏమన్నా కనవడ్డదా? సబ్కా సాత్ సబ్కా వికాస్.. దేశం ఏమైనా బాగుపడ్డదా? దేశం సత్యనాశనమైంది. ధరలు పెరిగినయ్. పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధర పెరిగింది. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా కనిపించాయా? వికసిత భారత్ వికసించిందా? దళితుల బతుకులు మారినయా? పేదల బతుకులు మారినయా? బుల్లెట్ రైళ్లు వచ్చినయా? రైతుల ఆదాయం డబుల్ అయ్యిందా ? అమృత్కాల్ వచ్చిందా? మరి ఎందుకు వీళ్లకు ఓటేయాలి? మనం పిచ్చోళ్లమా? ఇవాళ ఏం జరుగుతుంది? అంటూ ప్రశ్నించారు.
‘నిన్న ఎవరో గుజరాత్ ముఖ్యమంత్రి నాగర్ కర్నూల్కు వచ్చిండటా.. మనకు గుజరాత్ నుంచి ముఖ్యమంత్రి? 1500 మంది ఆయన మీటింగ్కు. నేను ఒక్కటే మనవి చేస్తున్నా. చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకో నవోదయ పాఠశాల ఇవ్వాలి. పేద పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారు. నరేంద్ర మోదీకి నేను వంద ఉత్తరాలు రాశాను. అయ్యా మాది కొత్త రాష్ట్రం. చట్టం ఉన్నది. చట్టం ప్రకారం రావాల్సిన నవోదయ పాఠశాలలు ఇవ్వమంటే ఒక్కటీ కూడా ఇవ్వలేదు. ఆయన ఇస్తే ఇవాళ నాగర్ కర్నూల్లో నవోదయ పాఠశాల రాకపోవునా? మరి ఎందుకు ఓటు బీజేపీకి వేయాలి. భారతదేశంలో 157 మెడికల్ కాలేజీ పెట్టిండు. మా కొత్త రాష్ట్రంలో నాలుగు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో పాలమూరు బతుకుతుంది. ఇక్కడే ఉంది మన వట్టెం రిజర్వాయర్. కొన్ని గ్రామాలు పోయినా నీళ్లు రావాలి.. లక్షల ఎకరాలు పారాలని చెప్పి ఆరపడి కట్టుకున్నాం. దానికి జాతీయ హోదా ఇవ్వాలని అన్నం. కొత్తం రాష్ట్రం కాబట్టి రూ.25వేలకోట్ల సహాయం అడిగాం. 25నయా పైసలు కూడా ఇవ్వలేదు’ అని ఆరోపించారు.
‘ఉల్టా ఏం చేసిండు మోదీ. కేసీఆర్ నువ్వు రైతుల మోటర్లకు కరెంటు మీటర్లు పెట్టాలే. లేకపోతే సంవత్సరానికి రూ.5వేలకోట్లు నీకు ఇచ్చే గ్రాంట్ కట్ చేస్తా అన్నడు. మోదీ గారు నా తల తెగిపడ్డా సరే మీటర్లు పెట్ట అని చెప్పిన. నా రాష్ట్రంలో కరెంటు కావాలి. ఆ బాధేందో నాకు తెలుసు. నేను కూడా రైతునే. మీటర్లు పెట్ట అన్న. కానీ ఇప్పుడు ఏమైతది? బీజేపీకి ఒక్క ఓటు వేసినా ఏ మంటడు మోదీ.. నేను మీటరు పెడుతా అనంగ కూడా నాకే ఓటు వేశారు. బరాబర్ పెడుతా? అంటడు. అప్పుడు మనం యాడికిపోవాలి? అందుకే యువకులకు చెబుతున్నా ఆలోచన చేయాలి. ఉన్మాదంలో పడిపోవద్దు. మన బతుకులు కావాలా? మన పంటలు పండలా? మన పొలాలు బాగుండాలా? ఈ నరేంద్ర మోదీ గాయిగత్తర కావాల్నా? ఏం కావాలి? ఊరికే నినాదం చెప్పడం కాదు. మీమీ గ్రామాల్లో చర్చ పెట్టండి. మన కోసం బీఆర్ఎస్ను కాపాడుదామా? మన బతుకులను ఆగం చేసేవారిని కాపాడుదామా? అనే మాట గ్రామగ్రామాన, ప్రతి తల్లి, చెల్లెలు, ప్రతి పెద్దాయనకు చెప్పి దండం పెట్టి ఓటు అడుగండి’ అని సూచించారు.
‘ప్రవీణ్ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించండి. మన హక్కులను కాపాడుకుందాం. ప్రవీణ్ అంటే ఎలాంటి వ్యక్తో ఒక్క మాటలో చెబుతా? నేను ముఖ్యమంత్రి అయ్యాక ప్రవీణ్ను పిలుచుకున్న. ప్రవీణ్గారు మీరు గురుకులాలు మంచిగ నడుపుతున్నరు. ఇంకా బాగా నడపాలి. మీ బడ్జెట్ ఎంత కావాలంటే అంత తీసుకోండి. వాటి జూనియర్ కాలేజీలు కూడా చేయండి. బ్రహ్మాండంగా నడపండి అని చెప్పిన. తెలంగాణ గురుకులాలు అంటే.. ఇంటర్నేషనల్ స్కూల్స్కు సమానం. అద్భుతమైన డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఐటీ, ఐఐఎంలు, ఐఏఎస్లు, పైలెట్స్, ఎవర్టెస్ ఎక్కిన బిడ్డలను గురుకులాల నుంచి పుట్టించిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది. దేశాన్ని బాగు చేయాలని ఉంది. అట్టడుగు వర్గాలను పైకి తేవాలని ఉంది. మన రైతులను కాపాడుకోవాలని ఉంది. మన రాష్ట్రానికి మేలు చేసుకోవాలని ఉంది. ఆయన ఆషామాషీ వ్యక్తి కాదు. ఒక మాజీ ఐపీఎస్ అధికారి. ఉన్నతస్థాయిలో పని చేసిన అధికారి. ఇలాంటి వ్యక్తులు గెలిస్తే విచక్షణ ఉంటది. మంచి ఉంటది. అన్నీ లాభాలు జరుగుతయ్. ఇలాంటి వ్యక్తులు మళ్లీ మళ్లీ దొరుకరు. ఇలాంటి వ్యక్తులు చదువుకున్న వారు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తమని వచ్చినప్పుడు గెలిపించుకోవడం మన బాధ్యత’ అంటూ పిలుపునిచ్చారు.