KCR | మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన రెండు పిల్లర్లు కుంగిపోవడం వెనుక జరుగుతున్న ప్రచారాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరణ ఇచ్చారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాధాన్యత ఏంటనేది స్పష్టంగా తెలిపారు. ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాళేశ్వరం స్వరూపాన్ని వివరించారు.
అంతర్ రాష్ట్ర వివాదాలు, ముంపు సమస్యలు రావద్దంటే కన్నెపల్లికి కొంత దూరంలో కడితే మేడిగడ్డ బ్యారేజి లేకుండా నీళ్లు తీసుకోవచ్చని ఇంజనీర్లు చెప్పారని ఆనాటి పరిస్థితులను కేసీఆర్ తెలిపారు.. దాని ప్రకారమే మేడిగడ్డ బ్యారేజి కట్టామని.. ఇప్పుడు కూడా బ్యారేజి లేకుండానే నీళ్లు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికి మేడిగడ్డ అవసరం లేదని.. మేడిగడ్డ బ్యారేజికి సంబంధం లేకుండా వందల టీఎంసీలు తీసుకోవచ్చని. తీసుకున్నాం కూడా అని తెలిపారు.
‘ గోదావరిలో 50 వేల క్యూసెక్కుల వరద వస్తే పంప్హౌస్ రన్ అవుతుంది. అలా ఏడాదిలో నాలుగు నెలలు ఉధృతి ఉంటుంది. అప్పుడు ఎంతైనా నీళ్లు ఎత్తుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజికి 80కి పైగా గేట్లు ఉంటాయి. గోదావరికి వరద వస్తున్న సమయంలో అన్ని గేట్లు ఎత్తేస్తారు. గోదావరి నది ఫ్రీగా ప్రవహిస్తూనే ఉంటుంది. అప్పుడు అందినంత వరకు పంప్హౌస్ నుంచి వాడుకుంటారు. అక్కడ 2200 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న 17 పంప్ సెట్లు న్నాయి. వాటిలో ఎన్ని అవసరం ఉంటే.. అన్ని వాడుతుంటాం. సెప్టెంబర్లో వర్షాలు తగ్గుముఖం పడుతాయి. అప్పుడు మొత్తం గేట్లు మూసివేయకుండా.. అటు, ఇటు చివరలో నాలుగు గేట్లు తెరిచి ఉంచుతారు. ఈ గేట్ల ద్వారా వచ్చిన నీరు వచ్చినట్లు వెళ్తుంటాయి. నదీ ప్రవాహాన్ని బట్టి ఒక్క గేటు కూడా తెరిచి ఉంచుతాం. ఫిబ్రవరిలో కూడా 30, 40 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంటుంది. అప్పుడు కొంత ఉంచుకుంటూ పంప్హౌస్లు రన్ చేస్తుంటాం. ఇక్కడ ఉన్న కిటుకు ఇది. ఎండాకాలంలో రెండో పంట సమయంలో సాగు నీరు, మంచి నీటి కోసం ఇది ఉపయోగపడుతుంది. వరద ఉండే టైమ్లో ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. అక్కడ మూడు బ్యారేజిలు కట్టినం. 16 టీఎంసీలు, 7 టీఎంసీలు, 11 టీఎంసీలు ఉంటాయి. మీద ఎల్లంపల్లి బ్యారేజిలో 20 టీఎంసీలు ఉంటాయి. దీని మీద మిడ్ మానేరు, రిజర్వాయర్లు ఉంటాయి.’ అని కేసీఆర్ తెలిపారు.
‘ మేం 14 టీఎంసీలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల నుంచి 147 టీఎంసీల రిజర్వాయర్ కట్టినం. ఈ 147 టీఎంసీల రిజర్వాయర్లు క్షేమంగా ఉన్నాయి. 200 కిలోమీటర్ల టన్నెల్స్ క్షేమంగా ఉన్నాయి. బ్రహ్మాండమైన సర్జ్పూల్స్ ఉన్నాయి. 1500 కి.మీ. కాలువలు కట్టినం. అవి క్షేమంగానే ఉన్నాయి. మూడు బ్యారేజిల మీద కట్టిన అన్ని పిల్లర్లు క్షేమంగానే ఉన్నాయి. అట్లనే కాల్వల మీద కట్టిన బ్రిడ్జిలు, వాటికింద కట్టిన వందలాది పిల్లర్లు మంచిగనే ఉన్నాయి. అనేక పంప్హౌస్లు బ్రహ్మాండంగానే పనిచేస్తున్నాయి. ఒక్క మేడిగడ్డ బ్యారేజిలోని ఏడో బ్లాక్లో 10 పిల్లర్లు ఉన్నాయి. వాటిలో రెండు పిల్లర్లు కొంచెం ఎక్కువ, మూడో పిల్లర్ కొంత కుంగినయ్. ఇవి ఎన్నికల ముందే కుంగినయ్.’ అని కేసీఆర్ తెలిపారు.
పిల్లర్లు ఎందుకు కుంగినయ్.. ఏమైందని అక్కడి అధికారులను అడిగితే జరిగింది చెప్పారని కేసీఆర్ తెలిపారు. ‘ అంతకుముందు సంవత్సరం 28 లక్షల క్యూసెక్కుల భయంకరమైన వరద వచ్చింది. అప్పుడే కన్నెపల్లి పంప్హౌజ్ మునిగింది. దాన్ని రిపేర్ చేసుకున్నాం. ఆఫ్లైన్ ఎప్పటికప్పుడు సరి చేయాలి. వీటికోసమే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఈఎన్సీ పోస్టు క్రియేట్ చేసి నాగేందర్కు బాధ్యతలు అప్పగించాం. అక్కడ ఉండే సీఈ ఆ మెయింటెన్ చేయాలి. దాన్ని సర్దాలి. కానీ అది సర్దకపోవడంతో దాని కింద ఉన్న ఇసుక కుంగి కొంచెం క్రాక్ వచ్చింది. అది కూడా ఒక్కటే బ్లాక్లోనే. కాంగ్రెసోళ్లు ఏమనుకున్నారు.. మేం అట్నే వదిలేస్తాం.. కేసీఆర్ను బద్నాం చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయాలి.. బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే దురుద్దేశంతో ఉన్నారు. అప్పటికే 8, 10 వేల క్యూసెక్కుల నీరు పోతా ఉంది. ఆ ఇసుకలో కాపర్ డ్యామ్ వేసిన ఇక్కడ పంప్లు గుంజుతాయి. దాంతో ఎప్పటికప్పుడు నీటిని నింపాల్సి ఉండే. కానీ వాళ్లు మొత్తం బ్యారేజి కొట్టుకుపోతుందని అనుకున్నారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఒక్క బ్లాక్ను రిపేర్ చేయకపోయినా.. మిగిలిన బ్లాక్లు వందేళ్లు అయినా పనిచేస్తాయి.’ అని కేసీఆర్ అన్నారు..
‘ చిల్లర రాజకీయం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బలి చేస్తామంటే ఎలా ఊరుకుంటాం.. టన్నెల్స్కు ఏమైనా అయ్యిందా? కాల్వలకు ఏమైనా అయ్యిందా? పంప్హౌస్లకు ఏమైనా అయ్యిందా? బ్యారేజిలకు ఏమైంది? అక్కడ ఎంత వెర్రి చేతలు.. అక్కడ గ్రౌటింగ్ ప్రతి సంవత్సరం చేయాలి. నదుల మీద ఉండే బ్యారేజిలు, రిజర్వాయర్లకు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఆ మెయింటెనెన్స్ నిర్లక్ష్యం చేస్తే ప్రాజెక్టు లేచి పోతుందన్నారు.’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.