KC Venugopal | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) ‘అసెంబ్లీ ఎన్నికలప్పటి జోష్, పట్టుదల పార్లమెంట్ ఎన్నికల్లో కొరవడింది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల కంటే చాలా వెనుకబడి ఉన్నాం. పార్టీలో కొత్తగా చేరిన నేతలకు, పాత వారికి మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. మనమే గెలుస్తామన్న అతివిశ్వాసం అసలు వద్దు. అలసత్వానికి తావులేదు. ఇక్కడ ఏం జరుగుతున్నదో అధిష్ఠానానికి అంతా తెలుసు. మంత్రులు తమకు అప్పగించిన నియోజకవర్గాల్లోనే ఉండాలి. తెలంగాణపై అధిష్ఠానం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఎన్నికల మ్యానిఫెస్టో క్షేత్రస్థాయికి వెళ్లలేదు’ అని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ క్లాస్ పీకినట్టు తెలిసింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్లలో ప్రత్యర్థి పార్టీల కంటే మన అభ్యర్థులు వెనుకబడి ఉన్నారంటూ ఒక నివేదికను చూపించినట్టు సమాచారం.
శంషాబాద్ నోవాటెల్లో ఆదివారం సాయంత్రం పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్చౌదరి, విష్ణు తదితర కీలక నేతలతో వేణుగోపాల్ చర్చించారు. సమావేశానికి కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా హాజరై నియోజకవర్గాలవారీగా తాజాగా తమ టీమ్ నిర్వహించిన ఫ్లాష్ సర్వే వివరాలను వెల్లడించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. కొందరు అభ్యర్థులు టికెట్ కోసం చూపిన ఆసక్తిని ప్రచారంలో కనబరచడం లేదని అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. బీజేపీకి ఉత్తరాదిలో ప్రాబల్యం తగ్గుతున్నదని, దీంతో దక్షిణాదిపై ఫోకస్ చేస్తున్నదని, కాబట్టి తెలంగాణలో ఆ పార్టీనే టార్గెట్ చేయాలని సూచించినట్టు తెలిసింది. జిల్లాల్లో చాలామంది నాయకులు కాంగ్రెస్లో చేరడానికి ఆసక్తి చూపుతుంటే, స్థానిక నాయకత్వం వారిని అడ్డుకుంటున్నట్టు తమకు సమాచారం ఉన్నదని, అలా చేయడం వల్ల వారు బీజేపీలో చేరితే మనకు నష్టం కాదా? అని ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీలోకి వచ్చే వారిని పాత వారు కలుపుకొని పోవాలని, సమన్వయలోపం ఉండకూడదని సూచించినట్టు తెలిసింది. మంత్రులకు, నాయకులకు మధ్య సమన్వయలోపం ఉన్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, అలా జరగకుండా చూసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్-బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరినట్టు సమాచారం ఉన్నదని పేర్కొన్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో మిషన్ 15 లక్ష్యంతో పనిచేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఆదేశించారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. శంషాబాద్ నోవాటెల్లో పార్టీ సమావేశం ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. పెండింగ్లో ఉన్న మూడు స్థానాలకు కూడా వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారని తెలిపారు.
బీఆర్ఎస్కు చెందిన మరో కీలక నేత కాంగ్రెస్లో చేరబోతున్నారని కేసీ వేణుగోపాల్ రాష్ట్ర పార్టీ నేతలకు హింట్ ఇచ్చినట్టు తెలిసింది. ఆ నాయకుడు ఎవరు అనేది మాత్రం సమావేశంలో ఆయన వెల్లడించలేదని తెలిసింది. పార్టీ నేతలు, అభ్యర్థులతో సమావేశం ముగిశాక సీఎం రేవంత్రెడ్డి, దీపాదాస్ మున్షీతో కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠాన నిర్ణయాన్ని వీరికి వివరించినట్టు తెలిసింది.