బడంగ్పేట, జూలై 6: తమ్ముడు సాయిచంద్ లేని లోటు తీర్చలేనిదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సాయిచంద్ భార్య రజిని, కూతురు నది (క్యూటీ), కుమారుడు హరీశ్ను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అమరుడు శ్రీకాంతాచారి పాటతో సాయిచంద్ ప్రపంచానికి పరిచయం అయ్యారని గుర్తుచేశారు.
ఉద్యమ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సాయిచంద్ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారని పేర్కొన్నారు. ఉద్యమంలో తన పాట ద్వారా లక్షల మందిని కదిలించారని చెప్పారు. ఉద్యమమే ఊపిరిగా పనిచేశారని తెలిపారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా కానరాని లోకానికి వెళ్లిపోయారంటే ఊహించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సాయిచంద్ కుటుంబానికి 75 లక్షల మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యులు అండగా ఉంటారని చెప్పారు. సాయిచంద్ కుటుంబాన్ని ఓదార్చినవారిలో దేవీప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, కార్పొరేషన్ల చైర్మన్లు పల్లె రవికుమార్గౌడ్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తదితరులు ఉన్నారు.