Kasarla Shyam | “సమాజానికి ప్రతీక పాట. అక్కడి పరిస్థితిని ప్రతిబింబించేదీ పాటే. ఒకప్పుడు తెలంగాణలో ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ తరహా పాటలు ఉండేవి. ఇవాళ… ‘గోడ కట్టని గూడు నా పల్లె, కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు..’ అని పాడుకుంటున్నం. ఇదంతా తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత వచ్చిన మార్పే” అంటున్నారు గీత రచయిత కాసర్ల శ్యామ్. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసలో పాట రాయాలంటే పిలిచే పేరు కాసర్ల శ్యామ్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పాటతో తన అనుబంధాన్ని, తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసభాషలకు పెరిగిన ప్రాధాన్యాన్ని ‘జిందగీ’తో పంచుకున్నారు కాసర్ల శ్యామ్.
మాది హన్మకొండ. అక్కడే చదువుకున్నా. చిన్నప్పటి నుంచే సాహిత్యం మీద ఇష్టం ఉండేది. బడి రోజుల్లోనే కవితలు రాసేవాడిని. వరంగల్లో ఎక్కడ ఏ సాహిత్య సభ జరిగినా వెళ్లేవాడిని. అలా కళారంగం అంటే ఆసక్తి ఏర్పడింది. తెలుగు విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు జానపద కళలతో పరిచయం మొదలైంది. ఆ ఆసక్తి మరింత పెరిగి.. తెలంగాణలోని చాలా పల్లెలు, పట్నాలు తిరిగాను. ఆయా ప్రాంతాల్లోని పలుకుబడులు, యాసలు తెలుసుకున్నాను. ఈ అనుభవం గీత రచయితగా ఎంతో ఉపయోగపడింది. పాట పునాదుల మీదే తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ రాష్ట్రమూ సాకారమైంది. రాష్ట్ర అవతరణ తర్వాత సాంస్కృతికంగా అనేక మార్పులు వచ్చాయి. సినిమా, సాహిత్యం, పాలన.. ప్రతి చోటా మన యాసకు పెద్దపీట వేస్తున్నారు. నా వంతు ప్రయత్నంగా.. క్రమంగా అంతరించిపోతున్న పదకోశాన్ని ఇప్పటి పాటల్లో జోడిస్తూ..
ఈ తరానికి మన యాస-భాష భద్రంగా అందిస్తున్నా. ఇటీవల ‘దసరా’ సినిమా కోసం నేను రాసిన ‘చమ్కీల అంగీలేసి..’ పాటలో తల్వాలు, చటాకు, బాయి గిరక, చేదబాయి, మోటబాయి, బండకేసి కొడ్తడు, అమాస, పున్నానికి లాంటి తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పదాలు వాడాను. ఇప్పుడిప్పుడే ఆ మాధుర్యాన్ని మిగతా ప్రాంతాల వారూ తెలుసుకుంటున్నారు. దీంతో మన మాటలకే కాదు, పాటలకూ ప్రాధాన్యం పెరిగింది.
ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్ ‘శ్యామ్! ఇంతకాలం తెలంగాణ సాహిత్యం అంటే ఎరుపు రంగుతో ఉంటుంది, విప్లవ భావాలు ఉంటాయి అనుకున్నాం. కానీ, నువ్వు తెలంగాణ యాసలో పాజిటివ్ పొయెట్రీ రాస్తున్నావు. గుడ్’ అన్నారు. ఈ ప్రశంస ఆధునిక తెలంగాణ సాహిత్యానికంతా చెందుతుంది. పాటల్లో ఇంతకాలం మన బాధలు, గోసలు చెప్పుకొన్నాం. కానీ ఇప్పుడు మన సాహిత్యంలో సానుకూల దృక్పథం పెరిగింది. పంటలతోపాటు మన సాహిత్యమూ సస్యశ్యామలమైంది. ఈ మధ్య గజ్వేల్, సిరిసిల్ల వెళ్లాను. దారిలో ఎక్కడ చూసినా పచ్చదనమే. రాష్ట్రం సాధించుకున్నాక మన జీవితాల్లో వచ్చిన మార్పు, ఆనందం, అభివృద్ధి మన గేయాల్లో ప్రతిబింబిస్తున్నది. తెలంగాణ నుంచి కొత్త దర్శకులూ వస్తున్నారు. దీంతో మన స్థానిక కథలు తెరకెక్కుతున్నాయి. మన మాటలు, పాటలు ప్రపంచమంతా మారుమోగుతున్నాయి.
ఇంతకుముందు ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ అంటూ విషాద గీతాలు రాసుకున్నాం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయి. అందుకే, ‘బలగం’ సినిమాలో నేను ‘నా పల్లె బంధాల ముల్లె, గోడ కట్టని గూడు నా పల్లె…’ అని రాశాను. ఒకప్పుడు అన్ని రంగాల్లోనూ మన పట్ల వివక్ష చూపారు. అంతులేని దోపిడి జరిగింది. దీంతో మనలో కోపం, పట్టుదల, అశాంతి ఉండేవి. ఇప్పుడు ఆ ఉద్వేగాలు తగ్గాయి. ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చింది. కేసీఆర్ నాయకత్వం ఫలితంగా సమాజంలో వచ్చిన గణనీయమైన మార్పు ఇది.