రంగారెడ్డి, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): తండోప తండాలుగా తరలివచ్చిన ప్రజానీకం. సభా ప్రాంగణంలో ఇసుకేస్తే రాలనంత జనం. రోడ్లపై గులాబీ వనంలా పరుచుకున్న జనసందోహం. ఇదీ చేవెళ్ల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్కు నిదర్శనం. లోక్సభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన తొలిసభ విజయవంతమైందనడానికి సజీవ సాక్ష్యం. చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో శనివారం గులాబీ దళం ఎన్నికల రణభేరి మోగించింది. తరలివచ్చిన అశేష ప్రజానీకం నీరాజనం పలికింది. ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రభంజనం సృష్టించారు.
చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి యువకులు, మహిళలు, ముస్లిం మైనారిటీ, వృద్ధులు, వర్తక, వ్యాపారులు, సబ్బండ వర్ణాలు తరలిరావడంతో సభా ప్రాంగణంతోపాటు పరిసర ప్రాంతాలన్నీ జన సంద్రమయ్యాయి. ఊర్లకు ఊర్లే ఉదయాన్నే ఇల్లు కదిలి దండులా రావడంతో ఏడు నియోజకవర్గాల్లోని ప్రజానీకం ఆసాంతం తరలివచ్చినట్టుగా కనిపించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చి బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ విజయం ఖాయమైందన్న భావనను కల్పించారు. అశేష జన ప్రవాహంతో సభకు వచ్చే దారులన్నీ గులాబీ మయమయ్యాయి. సభ ప్రాంతంలోనూ ఫ్లెక్సీలు, గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ఊహించిన దానికంటే గ్రాండ్ సక్సెస్ కావడంతో ఈ సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది.
కేసీఆర్ సభ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 3 గంటల నుంచే ప్రజలు రాక మొదలైంది. ఐదు గంటలకే సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. ఉప్పెనలా జనం తరలిరావడంతో సభా ప్రాంగణం బయటే వేలాది మంది ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి, కంది హైవేతోపాటు చేవెళ్ల శివారు ప్రాంతాలన్నీ జనంతో కిటకిటలాడాయి. కేసీఆర్ ప్రసంగాన్ని వినాలన్న ఆసక్తితో చాలా మంది వాహనాలు దిగి కిలోమీటర్ల మేర నడుచుకుంటూ సభ ప్రాంగణానికి రావడం కనిపించింది. పిల్లా పాపలతో మహిళలు, వృద్ధులు, యువత, రైతులు సైతం భారీ సంఖ్యలో తరలివచ్చారు.
సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ప్రజలను ఆకట్టుకున్నది. అరగంటకుపైగా సాగిన కేసీఆర్ ప్రసంగాన్ని జనం ఆసక్తి ఆలకించారు. పదేండ్లపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని కేసీఆర్ ప్రజలకు వివరించారు. హస్తం పార్టీకి అవకాశం ఇస్తే ఈ కొద్ది రోజుల పాలనలోనే జరిగిన నష్టాన్ని విశదీకరించారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో గట్టి షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రసంగం సాగుతున్నంత సేపు ‘జై కేసీఆర్.. జై జ్ఞానేశ్వర్ అన్న’ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. కేసీఆర్ను ఆశీర్వదించేందుకు ప్రజలు పోటెత్తడంతో గులాబీ శ్రేణులకు వెయ్యి ఏనుగుల బలం చేకూరినైట్లెంది.
నృత్యాలు చేస్తూ సబ్బండవర్ణాల వారు సమూహాలుగా తరలివచ్చి సభా ప్రాంగణంలో సందడి చేశారు. ధూంధాం పాటలు సభికులను ఉర్రూతలూగించాయి. కళాకారుల బృందం ఆట పాటలు అలరించాయి. సభకు వచ్చిన ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా గులాబీ శ్రేణులు అన్ని వసతులు కల్పించారు. దూరం నుంచి సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్లను బిగించారు. నలువైపులా నుంచి వచ్చే వాహనాల కోసం ఎక్కడికక్కడ ఆయా రూట్లలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
సభ సక్సెస్ కావడంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలు చేసిన నేతల కృషి ఫలించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా ఏకతాటిపై నిలిచి సభ సక్సెస్ అయ్యేందుకు దోహదపడ్డారు. సభ తేదీ ప్రకటించిన నాటి నుంచే నేతలంతా సమాలోచనలు జరపడమే కాకుండా.. ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సభ సక్సెస్కు తమవంతు పాత్ర పోషించారు. సభాస్థలం ఎంపిక నుంచి ఏర్పాట్లు, జన సమీకరణ అన్నింటిలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రెండు రోజులుగా వరుసగా సభాస్థలికి వెళ్లి దగ్గరుండి పరిస్థితులను సమీక్షించారు. జన సమీకరణ కోసం సన్నాహక సమావేశాలు సైతం నిర్వహించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాలవారీగా నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఎంపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ను ఆశీర్వదించాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు.
శనివారం చేవెళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు. చిత్రంలో ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులు
చేవెళ్ల సభలో అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న కేసీఆర్. చిత్రంలో పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, బాలమల్లు తదితరులు
చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మంత్రి సబితారెడ్డితో కేసీఆర్ మంతనాలు. చిత్రంలో పార్టీ నేత కార్తీక్రెడ్డి
చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ధూంధాం పాటలకు చిందేస్తున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్వర్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి
చేవెళ్ల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అధినేత కేసీఆర్తో స్వామిగౌడ్ కరచాలనం. చిత్రంలో చేవెళ్ల బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తదితరులు