ఖిల్లాఘణపురం, ఆగస్టు 24 : వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని కర్నెతండా లిఫ్ట్ను ఈ నెల 20న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించి రెండ్రోజుల్లో మోటర్లు ఆన్ చేయకపోతే ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులకు సాగునీరు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిష్ఠాత్మకంగా కర్నె తండా లిఫ్ట్ను ఏర్పాటుచేస్తే దాన్ని ప్రారంభించడంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. మాజీ మంత్రి అల్టిమేటంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది.
రూ.87.53 కోట్లతో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మోటర్ను సోమవారం ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రాజేశ్రెడ్డి, ఎంపీ మల్లురవితో కలిసి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఈ ఎత్తిపోతల ద్వారా వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లోని 18 తండాల పరిధిలో 4,235 ఆయకట్టుకు సాగునీరు అందనున్నట్టు తెలిపారు.