హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన కవాతు గుర్తుకు వచ్చేలా ర్యాలీ(Rally) జరుపుతామని బీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్(Karne Prabhakar) అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల(Telangana formation Day) సందర్భంగా ర్యాలీ జూన్ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ నుంచి ప్రారంభమై తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్దకు చేరుకుంటుందని పేర్కొన్నారు.
అక్కడ కేసీఆర్ అమరులకు నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి సచివాలయం ముందు ఉన్న తెలంగాణ అమరుల చిహ్నం వరకు చేరుకుంటుందని తెలిపారు. ఈ ర్యాలీలో 1000 మంది కళాకారులతో పాటు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన అడ్వకేట్లు, డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యమంలో పని చేసిన ఉద్యోగులు, మహిళలు అందరూ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.