హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాల్సిన అంశాన్ని పక్కన పెట్టి, సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెంగాణభవన్లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డి పరిణతి చెందిన వ్యక్తిలా వ్యవహరించడం లేదని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్కు నోటీసుల విషయంలో సిట్ తీరు సరిగా లేదని పేర్కొన్నారు. కేసీఆర్ ఎక్కడ ఉంటున్నారో సిట్ అధికారులకు తెలియదా? అని ప్రశ్నించారు.
మొదటిసారి నోటీసులు ఇచ్చిన సమయంలోనే ఎర్రవెల్లి నివాసం గురించి కేసీఆర్ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. మాజీ మంత్రి హరీశ్రావు సిద్దిపేట నివాసం అధికారిక రికార్డుల్లో ఉంటే, హైదరాబాద్లోని నివాసంలో సిట్ అధికారులు నోటీసులు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ నందినగర్ నివాసానికి వచ్చి గోడకు నోటీసులు ఎలా అతికిస్తారు? అని నిలదీశారు.
కేసీఆర్ హయాంలో జరిగిన ప్రగతిపై ఎకనామిక్స్ సర్వే కొనియాడిందని కర్నె ప్రభాకర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 17లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు వచ్చినట్టు ప్రకటించిందని చెప్పారు. మిషన్ కాకతీయతో అభివృద్ధి చేసిన చెరువులతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అధికారికంగా గుర్తించిందని తెలిపారు. ఈ వాస్తవం మీడియాలో పతాక శీర్షికల్లో రావడంతో సీఎం రేవంత్రెడ్డి మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారని మండిపడ్డారు. దావోస్ పోయి సీఎం రేవంత్రెడ్డి ఒక్క రూపాయి పెట్టుబడులు కూడా తేలేదని విమర్శించారు.