స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల
కొనసాగింపు అంశంపై సుదీర్ఘ చర్చలు
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్తో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సుకు అనుగుణంగా సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాలు, సంప్రదాయ వృత్తులలో బీసీల వాస్తవిక జీవన స్థితిగతులు, వెనుకబాటుతనంపై బీసీ కమిషన్ అధ్యయనం చేపట్టింది. ఇటీవల తమిళనాడులో పర్యటించిన బీసీ కమిషన్ బృందం.. తాజాగా కర్ణాటకలో పర్యటిస్తున్నది. బెంగళూరులోని కర్ణాటక బీసీ కమిషన్ కార్యాలయంలో కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డేతో తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు భేటీ అయ్యారు. సుదీర్ఘ సమాలోచనలు చేశారు. కర్ణాటక బీసీ కమిషన్లు చేపట్టిన సమగ్ర సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రేజర్వేషన్ల కొనసాగింపులో సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిబుల్ టెస్ట్ కొలమానాలపై చర్చించారు. సమగ్ర సర్వే కోసం గత కర్ణాటక కమిషన్లు రూపొందించిన మెథడాలజీ, ప్రశ్నావళి, అవలంబించిన పద్ధతులపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను, ఉత్తర్వులను, చట్టాలను, కర్ణాటక బీసీ కమిషన్ నుంచి సేకరించారు. అనంతరం తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను కర్ణాటక కమిషన్ సభ్యులు శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కిశోర్గౌడ్, కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే, సభ్యులు రాజశేఖర్ బీఎస్ కళ్యాణ్ కుమార్ హెచ్ఎస్, సువర్ణ కేటీ, అరుణ్ కుమార్, శారదనాయక్, సభ్య కార్యదర్శి కేఏ దయానంద్, అధికారులు పాల్గొన్నారు. మరో మూడురోజులపాటు తెలంగాణ బీసీ కమిషన్ బెంగళూరులోనే పర్యటన కొనసాగిస్తుంది.