హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ అనుసరిస్తున్న విద్వేషపూరిత విధానాలతో దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కర్ణాటకలో జరుగుతున్న హలాల్, హిజాబ్ వివాదాలపై ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీ విధానాల వల్ల ప్రజల మధ్య వైషమ్యాలు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చిన్నప్పటి నుంచి బెంగళూరు అంటే ఎంతో ఇష్టమని, అది కేవలం కర్ణాటకకు చెందినదే కాదని, దేశ ఆస్తి అని స్పష్టం చేశారు.
‘బెంగళూరు అనేది ఐటీ హబ్ మాత్రమే కాదు.. మన దేశపు సిలికాన్ వ్యాలీ. అక్కడి పారిశ్రామిక అనుకూల వాతావరణం (ఎకో సిస్టం) నాకెంతో ఇష్టం. తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా నేను మొదటి నుంచీ ఆ నగరంతోనే పోటీ పడుతున్నా. సమీప భవిష్యత్తులో ఆ నగరాన్ని దాటేస్తామని అనుకొంటున్నాం. కానీ కర్ణాటకలో అధికార పార్టీ చర్యల వల్ల బెంగళూరు నగరం భారతదేశపు విద్వేషపు అడ్డాగా (హేట్ హబ్) మారుతున్నది’ అని వెల్లడించారు. అంతటి ప్రతిష్ఠాత్మక నగరంలో జరుగుతున్న హలాల్, హిజాబ్ వంటి విధానాల వల్ల దేశంలోని సామాన్య పౌరులు సైతం ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.