Accident | హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలు కాగా, ప్రయాణికులు మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనకు కారణమైన లారీ, బస్సు రెండూ కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందినవే.ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు తేల్చారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ కూడా ప్రాణాలు కోల్పోకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నిన్న మీర్జాగూడ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో టిప్పర్, బస్సు డ్రైవర్లు ఇద్దరు సహా 19 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంగా వచ్చిన కంకర టిప్పర్ బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నది. వికారాబాద్ జిల్లా తాండూరు డిపో ఆర్టీసీ బస్సు (టీఎస్ 34టీఏ6354) తాండూరు నుంచి తెల్లవారుజామున 4:30 గంటలకు 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరింది. మార్గంమధ్యలో వికారాబాద్ తదితర బస్టాప్లలో ఎక్కిన వారితో కలిపి మొత్తం 72 మంది ప్రయాణికులతో వెళ్తున్నది. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ గేట్ సమీపంలోని హైదరాబాద్-బీజాపూర్ హైవేపై చేవెళ్ల నుంచి వికారాబాద్కు కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ (టీజీ 06టీ3879) వాహనం ఎదురుగా అతి వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టి, దానిపై పూర్తిగా ఒరిగిపోయింది. దానిలో ఉన్న కంకరమొత్తం బస్సులోకి జా రింది. దీంతో ఆర్టీసీ బస్సు కుడివైపున 8 వరుసల సీట్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఆ సీట్లలో కూర్చున్న కొందరు ప్రయాణికులు బలమైన గాయాలతో మరణించగా, మరికొందరు కంకరలో కూరుకుపోయి ఊపిరాడక విలవిల్లాడుతూ చనిపోయారు. బస్సు డ్రైవర్తోపాటు టిప్పర్ డ్రైవర్ కూడా దుర్మరణం చెందారు. వీరితోపాటు 17 మంది ప్రయాణికులు ప్రాణాలొదిలారు. మృతుల్లో 12 మంది మహిళలు ఉండగా, ఆరుగురు పురుషులు, 10 నెలల చిన్నారి ఉన్నారు. మరో 25 మంది కి తీవ్రగాయాల పాలయ్యారు.
తాండూరు పరిధిలో మరో బస్సు ప్రమాదం
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ సమీపంలో, లారీని ఢీకొట్టిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు
సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు.. బస్సు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలు pic.twitter.com/YCKNqQXkhW
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2025