హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ‘ది కేరళ స్టోరీ’ సినిమా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ఓటర్లపై ప్రభావం చూపించడంలో విఫలమైందని, అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోవని ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. నీచమైన, విభజనవాద రాజకీయాలను తిరస్కరించిన కర్ణాటక ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో హైదరాబాద్, బెంగళూరు మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొనాలని ఆకాంక్షించారు. కర్ణాటకలో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కర్ణాటకలో ఏర్పడే కాంగ్రెస్ నూతన ప్రభుత్వానికి తన శుభాకాంక్షలు తెలిపారు.