Karnataka | హైదరాబాద్, డిసెంబర్ 25 (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ): పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని గతంలో వ్యాఖ్యానించిన కర్ణాటక చెరకు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి శివానంద్ పాటిల్.. తాజాగా మరోసారి అన్నదాతలపై నోరుపారేసుకున్నారు. రుణమాఫీ కోసం పదేపదే కరువు రావాలని రైతులు కోరుకుంటున్నారంటూ మాట్లాడారు. కరువు రావాలనేది వారి కోరికని, తద్వారా ప్రభుత్వాన్ని తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేయొచ్చనేది వారి అలోచన అని వ్యాఖ్యానించారు. బెళగావిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి శివానంద్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రైతులకు కృష్ణా నది నీళ్లు, కరెంట్ ఉచితంగా లభిస్తున్నా ఒకే కోరిక ఉన్నది. ప్రతిసారి కరువు రావాలని వారు కోరుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వాన్ని రుణమాఫీ డిమాండ్ చేయవచ్చన్నది వారి ఆలోచన’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రి శివానంద్ పాటిల్ రైతులపై గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచిన తర్వాత రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయని వ్యాఖ్యానించారు.
ఇది కాంగ్రెస్ సంస్కృతి..
మంత్రి శివానంద్ పాటిల్ తాజాగా రైతులపై చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. ఆయన చేత రాజీనామా చేయించాలని సీఎం సిద్ధరామయ్యను డిమాండ్ చేశాయి. అన్నదాతలను పదేపదే అవమానించడం, రైతులను కించపరచడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతిగా మారిందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర విమర్శించారు. మంత్రి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు. రైతులకు ఏమిచ్చినా అది రాష్ర్టాభివృద్ధికే తప్ప భిక్ష కాదని హితవు పలికారు. ‘రైతులు ఆత్మగౌరవం ఉన్నవారు. పరిహారం కోసం వారు ఆశపడరు’ అని పేర్కొన్నారు.
క్షమాపణలు చెప్పాలి: కుమారస్వామి
మంత్రి శివానంద్ పాటిల్ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ సీఎం కుమారస్వామి డిమాండ్ చేశారు. అన్నదాతల కష్టాలు, నష్టాలను కించపరిచేలా మాట్లాడం కాంగ్రెస్ నేతలకు తగదని అన్నారు. మంత్రులు సంయమనంతో మాట్లాడాలని హితవు పలికారు. రైతులు తమ హక్కులనే అడుగుతారు తప్ప బిక్ష కాదని అన్నారు.
రైతులెవరూ కరువు కోరుకోరు: కేటీఆర్
రైతులు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కరువు రావాలని కోరుకోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంత్రి వ్యాఖ్యల వీడియోను సోమవారం తన ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేస్తూ. ‘రైతుల గురించి ఇంత చులకనగా మాట్లాడే వాళ్లు మంత్రులు ఎలా అయ్యారు? రైతులెవరూ కరువు రావాలని కోరుకోరు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ప్రభుత్వమే వచ్చి తమకు సాయం చేయాలని ఎదురు చూడరు’ అని పేర్కొన్నారు.
రైతులంటే అంత చులకనా?
‘రైతుల గురించి ఇంత చులకనగా మాట్లాడే వాళ్లు మంత్రులు ఎలా అయ్యారు? రైతులెవరూ కరువు రావాలని కోరుకోరు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ప్రభుత్వమే వచ్చి తమకు సాయం చేయాలని ఎదురు చూడరు’
-కేటీఆర్