(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ):కేసీఆర్ ప్రభావి ముఖందరు. అంతహ సీఎం నమాత్ర ఇద్దరే తుంబా చెన్నగిట్టు (కేసీఆర్ గొప్ప నాయకుడు..అలాంటి సీఎం మాదగ్గర ఉంటే బాగుండు)..కర్ణాటకలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్కు చెందిన రైతులు ముక్తకంఠంతో చెప్తున్న మాట ఇది.కాంగ్రెస్కు అధికారాన్ని అప్పగించి తాము తప్పు చేశామన్న అన్నదాతలు.. తెలంగాణ ఓటర్లు మాత్రం ఆ తప్పు చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
ఐదు నెలలు గడువకముందే కర్ణాటకను అధికార కాంగ్రెస్ కాటగలుపుతున్నది. సాగుకు నిరంతరాయంగా కరెంటిస్తామంటూ అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఐదు గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తూ రైతులను అరిగోస పెడుతున్నది. దీంతో కన్నడ అన్నదాతలు కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో కేసీఆర్ సర్కారు వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తుంటే, తమకెందుకు ఇవ్వరంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ మేరకు కర్ణాటకలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్కు చెందిన రైతులు తమ ఆవేదనను వెళ్లబోసుకొన్నారు.
తెలంగాణలో రైతు పథకాలు భేష్
‘అధికారంలోకి వస్తే.. ఇది చేస్తాం, అది చేస్తామం’టూ.. తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఊదరగొ ట్టారు. దీనిపై హుమ్నాబాద్ రైతులను ప్రశ్నించగా వాళ్లు ఈ విధంగా స్పందించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ సర్కారు తమకు ఏమీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పారపాటున కాంగ్రెస్కు ఓటేస్తే, అక్కడి రైతుల పరిస్థితి కూడా తమలాగే తయారవుతుందని హెచ్చరించారు. దీన్నిబట్టి కాంగ్రెస్కు ఓటెయ్యాలో? లేదో? తెలంగాణప్రజానీకమే నిర్ణయించుకోవాలని సూచించారు.తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటును ఇస్తుండటాన్ని వాళ్లు గుర్తుచేశారు. రైతులకు ఎకరాకు రూ. 10 వేలు పెట్టుబడిసాయంగా ఇస్తున్న ‘రైతుబంధు’ పథకాన్ని, రైతు బీమాను, 24 గంటల ఉచిత విద్యుత్తును, రైతు వేదికల ఏర్పాటును ప్రశంసించారు. అన్నదాతలకు ఇంత మేలు చేస్తున్న సీఎం కేసీఆర్ గొప్ప నాయకుడు అని కొనియాడారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమదగ్గర కూడా ఉంటే ఎంతో బాగుండునని మనసులో మాటను బయటపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఊసరవెల్లే ఉలిక్కిపడేలా..
‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్న’ అన్నట్టు ఉన్నది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. అధికారంలోకి రావడానికి ముందు సాగుకు నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేస్తామంటూ హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్ పెద్దలు.. పగ్గాలు చేపట్టిన తర్వాత దాన్ని అటకెక్కించారు. ఇటీవల సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఐదు గంటల కరెంటు సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. 7 గంటల కరెంటు ఇవ్వాలనుకొన్నా.. అది సాధ్యపడట్లేదని, 5 గంటల కరెంటు ఇస్తున్నామని డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు. నిరంతరాయ కరెంటు ఇస్తామంటూ ఓట్లడిగిన కాంగ్రెస్.. ఇప్పుడు ఐదు గంటల విద్యుత్తును మాత్రమే ఇస్తున్నదని కన్నారి, బీదర్, గుల్బర్గా, కొప్పాల్, గదగ్ తదితర ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.