కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కి ఐదు నెలలైనా కాలేదు.. అప్పుడే అన్నదాతను అరిగోస పెడుతున్నది. ఐదు గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోవడంతో కండ్లముందే ఎండుతున్న పొలాలను చూసిన కన్నడ రైతులది అంతులేని ఆవేదన. కాంగ్రెస్ను గెలిపించి తప్పు చేశామని, కల్లబొల్లి మాటలు విని మోసపోయామని లబోదిబోమంటున్నారు. హస్తం పార్టీని గెలిపించినందుకు పశ్చాత్తాపం చెందుతున్నారు.
– కన్నారి (సిందనూర్- కర్ణాటక) నుంచి వెల్జాల చంద్రశేఖర్
Karnataka | కర్ణాటక, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో కర్ణాటక రైతు చిత్తవుతున్నాడు. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు విద్యుత్తు సమస్యతో లక్షలాది ఎకరాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచని రైతన్న కన్నీరుపెడుతున్నాడు. ప్రత్యామ్నాయ చర్యలతో పంటలను కాపాడాల్సిన కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసింది. దీంతో కర్ణాటక అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది.
మునుపెన్నడూ తాము ఇలాంటి పరిస్థితి చవి చూడలేదని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పుచేశామని రైతన్నలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు వ్యవసాయానికి ఏడు గంటల కరంట్ ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత దానిని ఐదు గంటలకు కుదించారని, ఇప్పుడు అది కూడా రాకపోవడంతో కళ్ల ఎదుటే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. అసమర్థ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టి తప్పుచేశామని పశ్చాత్తాపం చెందుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో తీవ్ర విద్యుత్తు సరఫరా సమస్య తలెత్తడంతో ఒక్క వ్యవసాయానికే కాకుండా గృహాలకు కాంగ్రెస్ సర్కారు కరెంట్ కోతలు తీవ్రతరం చేసింది. పట్టణ ప్రాంతాలకు అరకొర విద్యుత్తును సరఫరా చేస్తూ, గ్రామీణ ప్రాంతాలకు రాత్రి, పగలు అనే తేడాలేకుండా విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. రోజుకు ఐదారు గంటలకు మించి విద్యుత్తు సరఫరా కావడం లేదు. కాంగ్రెస్ పాలనలో తమ బతుకులు అంధకారమయ్యాయని కన్నడ రైతులు మండిపడుతున్నారు.
విద్యుత్తు కోతలు, లో వోల్టేజీ కారణంగా పైర్లు ఎండిపోయాయని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రోడ్డెక్కారు. సబ్స్టేషన్ల ఎదుట, అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇండ్ల ముందు అన్నదాతల ధర్నాలతో కర్ణాటక రగిలిపోతున్నది. మెట్టపంటలు ఎండిపోతే వర్షాభావ పరిస్థితుల వల్ల అనుకోవచ్చు.. కానీ ప్రాజెక్టుల కింద అదే పరిస్థితి.. గొట్టపు బావుల కింద అదే దుస్థితి. ఎక్కడ చూసినా నోటికాడికి వచ్చిన లక్షలాది ఎకరాల్లో జొన్న, సజ్జ పంటలు, నీళ్లులేక పాలుతాగే దశలో ఉన్న వరిచేలు బీడుబారిపోతున్నాయి. ప్రభుత్వ అసమర్థత, రైతన్నల నిస్సహాయత వెరిసి కర్ణాటకలో ఎవరిని కదిలిస్తే కంట కన్నీరే కనిపిస్తున్నది. కాంగ్రెస్ సర్కారును గెలిపించి కష్టాలు కొనితెచ్చుకొన్నామని కన్నడ ప్రజలు తలపట్టుకొంటున్నారు.
రైతులను ఆదుకోవడంలో, వ్యవసాయానికి తోడ్పాటు అందించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్ అని నామాల నాగేశ్వర్రావు ప్రశంసించాడు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నారని, రైతు బంధు ఇస్తున్నారని, రైతు బీమా అమలు చేస్తున్నారని, వీటితోపాటు తెలంగాణలో పేదలకూ సంక్షేమ పథకాలు అందుతుండటం గొప్ప విషయమని అన్నాడు. పక్కనే ఉన్న తెలంగాణలో రైతు సంక్షేమం సాధ్యమైనప్పుడు.. ఇక్కడ కర్ణాటకలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించాడు. తమది తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రం అయినా సంక్షేమంలో వెనుకే ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశాడు.
‘జేడీఎస్ పాలన చూశాం.. బీజేపీ పాలన చూశాం.. ఒక్కసారి కాంగ్రెస్ పాలన చూద్దాం అనుకొని ఆ పార్టీని గెలిపించి తప్పు చేశాం’ అని సిందనూర్ తాలుకా సోమాలపల్లి గ్రామ అధ్యక్షుడు (సర్పంచ్) నామాల నాగేశ్వర్రావు ఆవేదన వ్యక్తం చేశాడు. సిందనూర్ తాలుకా కన్నారి గ్రామ శివారులో సాగుచేసిన తన జొన్న పంట కరెంట్ లేక.. నీళ్లు అందక పూర్తిగా ఎండిపోయిందని వాపోయాడు. తమ గ్రామంలోనే వేలాది ఎకరాల్లో జొన్న పంట, వరి చేన్లు ఎండిపోయాయని తెలిపాడు.
తుంగభద్ర ఎడమ కాలువకు నీరు వదిలితే పంట కాపాడుకునే వారమని, ప్రాజెక్టులో నీరు లేకపోతే ఎక్కడి నుంచి వదులుతామని ప్రభుత్వం వాదిస్తున్నదని మండిపడ్డాడు. నీరు వదలకపోయినా కాలువల ద్వారా నింపుకొన్న బావులు, కుంటల నుంచి నీరు పారించుకోవడానికైనా విద్యుత్తు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తంచేశాడు. పేదలకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం వల్ల వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇవ్వలేకపోతున్నామని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు కుంటిసాకులు చెప్తున్నారని మండిపడ్డాడు.
తాను, కుటుంబ సభ్యులందరం కలిపి ఈ ఏడాది మొత్తం 40 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశామని, ఎకరానికి రూ. 30 వేల చొప్పున రూ.12 లక్షల పెట్టుబడి పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేయడంతో నిలువునా మునిగామని బుదనాల క్యాంప్నకు చెందిన రైతు గారపాటి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశాడు. పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చామని, బంగారు కుదవ పెట్టామని, ఇప్పుడు ఆ బాకీలు తీర్చడం మాట అటుంచి ఎండిన జొన్న చేను తగలబెట్టాలన్నా మరింత ఖర్చు అవుతుందని వాపోయాడు.
కనీసం ఈ ఒక్క పంటను కాపాడేందుకు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలాలని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేసినా ఎలాంటి హామీ లభించలేదని మండిపడ్డాడు. అసలు రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కానీ, పంటలను కాపాడాలన్న తపన కానీ ఈ కాంగ్రెస్ సర్కారుకు లేదని తేలిపోయిందని అన్నాడు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పడం మినహా రైతన్న ఏమి చేయగలడని నిస్సహాయత వ్యక్తంచేశాడు.
ఎప్పటిలాగా పంటలు వేసుకుంటే, ఈ సారి విద్యుత్తు సమస్య వల్ల నిండా మునిగే పరిస్థితి వచ్చిందని బుదనాల క్యాంప్నకు చెందిన యువ రైతు బురిగిపల్లి నరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా విషయంలో కర్ణాటక కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమయ్యిందని మండిపడ్డాడు. రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పాదన సమస్య ఉంటే బయటి రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసి అయినా పంటలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశాడు. పొరుగున ఉన్న తెలంగాణలో అన్నదాతకు ఎలాంటి సమస్య లేదని, మరి ఇక్కడ అలా ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించాడు. తెలంగాణలో ఓవైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ కూడా వ్యవసాయానికి సరిపడా కరెంట్, రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుండగా.. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు చేతకావడం లేదని నిలదీశాడు. ఇక్కడే చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ఏం చేస్తుందని అన్నాడు.