Karnataka Farmers | ఊట్కూర్/కృష్ణ/మాగనూరు/నారాయణపేట రూరల్, నవంబర్ 19: ‘కర్ణాటకలో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది. ఇక్కడ (తెలంగాణలో) కూడా మోసం చేయాలని చూస్తున్నది. వారి గ్యారెంటీలను నమ్మి మేం మోసపోయాం. మీరు జాగ్రత్తగా ఉండాలి’ అని కర్ణాటక రాష్ట్రం దేవసూగూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.
కర్ణాటకకు చెందిన ‘పరిసర ప్రేమ’ రైతు సంఘానికి చెందిన దాదాపు 500 మంది రైతులు ట్రాక్టర్లు, బైక్లపై ఉదయం 11 గంటలకు నారాయణపేట జిల్లా కృష్ణ మండలం వాసునగర్ బార్డర్ చెక్పోస్ట్ వద్ద తెలంగాణలోకి ప్రవేశించారు. మరో పది రోజుల్లో తెలంగాణలో జరుగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి కేసీఆర్ను సీఎంగా గెలిపించుకోవాలంటూ ప్రజలను చైతన్యం చేశారు.
కర్ణాటక రైతులు మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ, మాగనూర్, మక్తల్, ఊట్కూర్ మండలాల మీదుగా నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మార్గమధ్యంలో గుడెబల్లూరులోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి, మక్తల్ పడమటి ఆంజనేయస్వామి, మాగనూర్ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయాలతోపాటు కొల్లంపల్లి కతాల్సాబ్ దర్గాను రైతులు దర్శించుకున్నారు.
తెలంగాణకు తిరిగి కేసీఆర్ సీఎం కావాలన్న లక్ష్యంతోనే తాము స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. కాగా.. కర్ణాటక రాష్ట్రం దేవసూగూర్ పరిసర గ్రామాల నుంచి తెలంగాణలోకి వస్తున్న రైతులపై మక్తల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జులుం ప్రదర్శించారు. రైతుల వాహన ర్యాలీకి అడుగడుగునా ఆటంకం సృష్టించారు. కృష్ణ మండలంలోని టైరోడ్డు, మాగనూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో వాగ్వాదానికి దిగారు.
కర్ణాటకలో కరెంటు సమస్య ఉన్నది తమకు కూడా తెలుసని, అక్కడ సమస్య ఉంటే అక్కడే ఉండి ధర్నాలు చేసుకోండని ఉచిత సలహాలు ఇచ్చారు. మెడలో గులాబీ కండువాలు వేసుకుని ప్రజలను చైతన్యం చేస్తామంటే ఒప్పుకునేది లేదంటూ వితండవాదానికి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి జోక్యం చేసుకోవడంతో కర్ణాటక రైతులు తమ వాహన ర్యాలీతో ముందుకు కదిలారు.