Karnataka Farmers | గద్వాల, అక్టోబర్ 24 : ‘కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు తప్పవు. వారు ఇచ్చిన హామీలకు ఆశపడి మేం ఓట్లు వేశాం. ఇప్పుడు గోస పడుతున్నాం. కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చింది.. ఇప్పటివరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మహిళల కోసం ఉచిత బస్సులు పెట్టారు. దీంతో కొంత దుర్వినియోగం అవుతుంది. తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే రైతులతోపాటు ప్రజలు ఉరి వేసుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ను నమ్మి తెలంగాణ ప్రజలు ఓటు వేయొద్దు’ అని సూచిస్తూ కర్ణాటకలోని రాయిచూర్కు చెందిన రైతులు మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శించడంతోపాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కల్యాణ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటకలో గత ప్రభుత్వాలు రైతులకు 12 గంటల కరెంట్ ఇస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 3 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వరి పైరు ఎండిపోతుందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హామీలు అమలుచేయలేక ప్రభుత్వం చతికిల పడిపోయిందని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఆరు హామీల పేరిట ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారు చెప్పే ఆరు హామీలు ఆరు నెలలు కూడా అమలు కావని హెచ్చరించారు. కాంగ్రెస్ను నమ్మి రైతులు, ప్రజలు ఓటేస్తే ఉరి వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. కర్ణాటకలో పంటలు ఎండిపోతున్నా.. రైతులు మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడంతో ఇక్కడి రైతులు సిరులు పండిస్తున్నారని, రైతు అకస్మాత్తుగా మరణిస్తే రూ.5 లక్షల బీమా ఇస్తున్నారని.. అలాంటి పథకాలు తమ వద్ద కూడా అమలు చేయాలని కర్ణాటక సర్కార్ను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్కు ఓటు వేయొద్దని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని తెలిపారు. కర్ణాటకలో కరెంట్ కష్టాలు ఎదుర్కొంటూ ప్రజలు చీకట్లో మగ్గుతున్నారని, కాంగ్రెస్ ఇచ్చే మోసపూరిత వాగ్దానాలు నమ్మి మోసపోద్దని కోరారు.