హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిలో కర్ణాటకకు నీటి కేటాయింపులు లేకున్నా ఆ రాష్ట్రం ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మించిందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. నదీ జలాల కేటాయింపుపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అత్యవసరం లేదని పేర్కొన్నది. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను పాక్షికంగానైనా అమలు చేయాలంటూ కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదిస్తూ.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా కృష్ణా నదిపై ప్రాజెక్టులు, కాలువలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్లు వెచ్చించిందని చెప్పారు. దీంతో 2013లో బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఆధారంగా 75 టీఎంసీల నీటి వినియోగానికి మీరు అనుమతి కోరుతున్నారా? అందుకు కేంద్రం అనుమతించవచ్చా? అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. దీనిపై శ్యాం దివాన్ స్పందిస్తూ.. ఏ విధంగా అనుమతించినా ఇబ్బంది లేదని, కర్ణాటక వినియోగించుకున్న నీటి లెకలను తెలిపేందుకు మీటర్లు, పర్యవేక్షణకు బోర్డు ఉన్నాయని చెప్పారు. దీనిపై తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ వాదిస్తూ.. స్టే ఎత్తివేతపై సుప్రీంకోర్టు గతంలోనే విచారణ జరిపి, కర్ణాటక విజ్ఞప్తిని తిరసరించిందని గుర్తుచేశారు. అదే అంశంపై మళ్లీ ఎలా వాదిస్తారని ప్రశ్నించారు. ట్రిబ్యునల్ తీర్పును ప్రచురించవద్దని 2011లో సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఎలాంటి అనుమతుల్లేకుండానే కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు, కాలువలు నిర్మించిందని, దిగువ రాష్ట్రాల హకులు, అవసరాలను పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.