బెంగళూరు, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిపిన ‘కమల్ ఫైల్స్’పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కర్ణాటక కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణలో రూ.150 కోట్ల ‘కమల్ ఫైల్స్’ వ్యవహారంలో పట్టుబడిన వారే కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చిన ఘటనలో కీలక పాత్ర వహించినట్టు ఆరోపించింది. బీఎల్ సంతోష్ నీచపు పనులు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయన్నది. ఎమ్మెల్యేల కొనుగోలులో సంతోష్ నాయకత్వంలోని ముఠాయే బీఎస్ యడియూరప్ప ప్రభుత్వాన్ని కుప్పకూల్చిందా? అమిత్షా హోంమంత్రా లేక ప్రజా ప్రభుత్వాలను హతం చేస్తున్న వ్యాపార దళారీనా? అని ప్రశ్నించింది.
కమల్ ఫైల్స్ అనే దగాకోరు పనిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్లు బయటపడ్తున్నాయని పేర్కొన్నది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలి అని డిమాండు చేసింది. ‘అధిష్ఠానానికి రూ.వేల కోట్ల కప్పాలు చెల్లించామని యడ్యూరప్ప, కేంద్ర మాజీ మంత్రి, దివంగత అనంతకుమార్ అంగీకరించారని గుర్తుచేసింది. బీజేపీలో రూ.2,500 కోట్లకు ముఖ్యమంత్రి పదవిఅన్నది బీజేపీ కేంద్ర మాజీ మంత్రియే. ‘పే సీఎం’ అని ఆందోళన చేస్తున్న ప్రజలకు.. తెలంగాణ కమల్ ఫైల్స్పై బదులిచ్చే ధైర్యం బీజేపీ నేతలకు ఉన్నదా?’ అని వరుస ట్వీట్లలో ప్రశ్నించింది.