కరీంనగర్: బెంగుళూరు వంటి నగరాలకు ధీటుగా కరీంనగర్ నగరాన్ని పచ్చదనం ,పరిశుభ్రతలతో అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ లో మున్సిపల్, ఆర్అండ్ బీ ఇంజినీరింగ్ శాఖలతో పాటు గుత్తేదారులతో మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, ఐలాండ్ పనులపై జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్షించారు.
మంత్రి మాట్లాడుతూ నగరంలో పైపులైను, రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. అప్రోచ్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, మానేరు రివర్ ఫ్రంట్ పనుల ప్రగతిపై అడిగి తెలుసు కున్నారు. డిసెంబర్ 31 నాటికి కేబుల్ బ్రిడ్జి ని ప్రయాణానికి సిద్ధం చేయాలని, మరుసటి రోజుకు లైటింగ్ పనులు పూర్తిచేయాలని సూచించారు. నగరంలో ఆక్రమణలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. నూతనంగా ఏర్పాటు చేసిన మార్కెట్లల్లో కూరగాయల విక్రయాలు జరిగేలా చూడాలని ఆదేశించారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో సరికొత్తగా ఐడిల్ ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని, డిసెబుల్ పార్కు నిర్మాణాలకు డీపీఆర్లను సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, నగర వైస్ చైర్మన్ చల్లా స్వరూప రాణి హరి శంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఆర్డీవో ఆనంద్ కుమార్, విద్యాశాఖాధికారి జనార్దన్ రావు, ఈ ఈ ఆర్అండ్ బీ సాంబశివరావు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.