హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ మరోసారి కదనశంఖం పూరించింది. ఎస్సారార్ కాలేజీ మైదానం బీఆర్ఎస్ పార్టీకి పునరుత్తేజాన్ని ఇచ్చింది. జై తెలంగాణ అంటూ పిడికిళ్లు మళ్లీ లేచాయి. గులాబీ దళపతి కేసీఆర్ తిరిగి ఉద్యమ సూరీడయ్యారు. కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై చండప్రచండమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ రెండూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఈ దశలో బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు రక్ష అని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీని కొందరు స్వార్థపరులు వీడితే నష్టమేమీ లేదని కరాఖండిగా చెప్పారు. ‘కరీంనగర్ మట్టినే బొట్టుగా పెట్టుకొని ముందుకెళ్లిన.. తెలంగాణ లేదు ఏమీ లేదు.. పనై అయిపోయింది.. అని హేళన చేస్తే కేంద్ర మంత్రి పదవిని, ఎంపీ పదవిని నేలకేసి కొట్టి రారా నా కొడుకా.. అని సవాల్ చేస్తే మీరే నన్ను ముందుకు నడిపిన్రు. ఇప్పుడదే ఎస్సారార్ కాలేజీ గడ్డ మీద నిలబడి మీ బిడ్డగా చెప్తున్న. తెలంగాణకు గులాబీ జెండాయే నిజమైన రక్షణ’ అని కేసీఆర్ అన్నప్పుడు సభాప్రాంగణమంతా జై తెలంగాణ నినాదంతో ప్రతిధ్వనించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎందుకు గెలిపించాలో కేసీఆర్ వివరించారు. గులాబీ సైనికులు ఊరూరా ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు.
కరీంనగర్ కదనభేరి సభ.. బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రేణులకే కాకుండా సమస్త గులాబీ శ్రేణుల్లో నయాజోష్ తెచ్చింది. దాదాపు పదేండ్లపాటు అధికారంలో ఉండి ప్రత్యర్థి పార్టీల నాయకులు తమపై ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా బాధ్యతాయుత స్థానంలో ఉన్నవాళ్లం బాధ్యతగా మెలగాలని హితవు చెప్పి తమనోళ్లను మూయించారే కానీ తమపై నిందలు వేస్తున్నవారిని పల్లెత్తు మాట అననీయలేదని కానీ, ఆ అవాంతరాలు కేసీఆర్ ఉగ్రరూపంతో తొలగిపోయాయని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు అకారణంగా తప్పుడు ప్రచారం చేసినా ఊరుకున్నామే కానీ, పల్లెత్తు మాట అనలేదని బీఆర్ఎస్ హయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో పోలీసుల అతిని కేసీఆర్ తనదైన భాషలో నిలదీసిన తీరుపై గులాబీ శ్రేణులకు కొండంత బలాన్ని ఇచ్చాయన్న ప్రతిస్పందన రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతున్నది.
‘పోలీసు సోదరులారా అనవసరమైన కేసులు పెట్టకండి.. పోలీసులకు రాజకీయాలతో ఏం పని? అధికారం ఎవడికి శాశ్వతం కాదు. పదేండ్లు మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద అనేక కుకలు మొరిగినాయి. ఎవరి పాపాన వారు పోతారని వదిలేశాం. ఆనాడు మేము పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేస్తే ఒక కాంగ్రెస్ వాళ్లు మిగిలేవారా?’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ‘చాణ్నాళ్లకు కేసీఆర్ మల్లా నిప్పులు దుంకిచ్చిండ్రు.. ఇగ కాంగ్రెస్.. బీజేపీ ఖేల్ ఖతం’ అని కేసీఆర్ ప్రసంగం తరువాత జనం నుంచి ప్రతిస్పందన వినిపించింది. అలాగే బీఆర్ఎస్ పార్టీని వీడేవారి గురించి ఏమాత్రం పట్టించుకోవాల్సిన పనిలేదని, స్వార్థపరులు నలుగురు పోతే పార్టీకి ఏమీ కాదని కేసీఆర్ అంటున్నప్పుడు పెద్దపెట్టున ‘అవును.. అవునూ’ అంటూ సభికుల నుంచి తామున్నామనే స్పష్టమైన అభయాన్ని కేసీఆర్కు రావడం విశేషం.
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సుదీర్ఘ కాలం తరువాత ధూంధాం.. చేసిండు. కరీంనగర్ కదనభేరి సభ సాక్షిగా రసమయి తన మాట, పాటతో ఉర్రూతలూగించారు. కాంగ్రెస్, బీజేపీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎండుతున్న పంటలు.. మొగులెక్కుతున్న ఎవుసం, కరెంట్ కోతలు, కాలిపోతున్న మోటర్లపై రసమయి ఉద్యమకాలం నాటి గళాన్ని మళ్లీ ఆవిష్కరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవశ్యకతను తన ఆటాపాటల ద్వారా వివరించారు. అలాగే ‘ఎవనిపాలైందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నడురో తెలంగాణ పాట’తో ఏపూరి సోమన్న ఇలా.. మొత్తంగా సుదీర్ఘకాలం తరువాత బీఆర్ఎస్ సభ తిరిగి ఉద్యమకాలం నాటి ఉద్వేగాన్ని రగిలించడం విశేషం.
దశాబ్దం తరువాత కేసీఆర్లో ఉద్యమసూరీడు దర్శనమిచ్చారు. ‘మాయ మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతుబంధు రూ.15 వేలు ఇస్తామన్నారు. పెండ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం అని ఇట్లా 420 హామీలు ఇచ్చారు. కానీ, రైతుబంధు ఇయ్యాలని అడిగితే రైతులను చెప్పుతో కొడ్తా అని మంత్రే అంటడు. ముఖ్యమంత్రి అయితే మానవబాంబు అయితా, పేగులు మెడలో వేసుకుంటా.. తొక్కుతా అంటడు.. ఇదేనా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాష’ అని ఆయన ప్రశ్నించారు. ‘నేనూ మాట్లాడిన ఉద్యమ సమయంలో తెలంగాణకు సమైక్య పాలకులు చేసిన అన్యాయానికి దద్దమ్మలు.. సన్నాసులు అని తిట్టిన.. కానీ, పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏనాడూ ఇటువంటి భాష మాట్లాడలేదు.
తెలంగాణ గౌరవాన్ని కాపాడిన.. అని చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తరువాత అంతా దోసుకుపోయిన్రు. ఇక్కడేం మిగలలేదు. లంకెబిందెలు లేవు అన్నానా? అని ఉదహరిస్తూనే ఎవడన్నా లంకెబిందెల కోసం ముఖ్యమంత్రి అయితడా? అని సీఎం రేవంత్రెడ్డిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలకులకు ప్రభుత్వాన్ని నడిపే సోయే లేదని చెప్పారు. తమకన్నా ఎక్కువ మంచిపనులు చేసి ప్రజల మెప్పు పొందాలే కానీ అదేపనిగా కేసీఆర్ను తిట్టుకుంటూ పోతే ఫాయిదా ఏమీ ఉండదని హితబోధ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కరీంనగర్ గడ్డతో తనకున్న పోరుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నప్పుడల్లా ఎస్సారార్ కాలేజీ మైదానం జై తెలంగాణ.. జై కేసీఆర్.. నినాదాలతో మార్మోగింది.
కరీంనగర్ కార్పొరేషన్/కమాన్చౌరస్తా/కలెక్టరేట్/తెలంగాణచౌక్, మార్చి 12: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెలికాఫ్టర్లో సాయంత్రం 5.35 గంటలకు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలోని హెలిప్యాడ్లో దిగారు. ఆయన వెంట స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఉన్నారు.
హెలిప్యాడ్ వద్ద కేసీఆర్కు కరీంనగర్ లోక్సభ ఎంపీ అభ్యర్థి బీ వినోద్కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్రావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి స్వాగతం పలికారు.
సాయంత్రం 6.39 గంటలకు సభా వేదికపైకి కేసీఆర్ చేరుకోగా, సభా ప్రాంగణమంతా ‘జై కేసీఆర్, జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగింది.
రైతులను చెప్పులతో కొట్టాలని ఓ మంత్రి మాట్లాడుతున్నారని, మరి రైతుల చెప్పులు అంతకన్నా గట్టిగా ఉంటయా? లేదా? అని కేసీఆర్ అన్నప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
ఈ సారి ఎన్నికల్లో వినోద్కుమార్ను ఏం చేద్దాం? అని కేసీఆర్ అడిగితే ‘గెలిపిస్తాం’ అంటూ ప్రజలు ఒక్కపెట్టున నినదించారు.
ఒక్క నవోదయ విద్యాలయం కూడా తీసుకురాని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలన్నప్పుడు ‘అవసరం లేదు’ అని ప్రజలు బదులిచ్చారు.
బీఆర్ఎస్ నేత వినోద్కుమార్కు, బీజేపీ ఎంపీ బండి సంజయ్కి పోలిక ఉందా? అన్నప్పుడు సభ చప్పట్లతో మార్మోగింది.
కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఎకరం అయినా పంట ఎండిందా? అని అనగానే.. ‘లేదు’ అంటూ జనం ప్రభంజనంలా నినదించారు. మరి ఇప్పుడు ఏం రోగం వచ్చిందంటే? ‘కాంగ్రెస్ వచ్చింది’ అంటూ ముక్తకంఠంతో చెప్పారు.
రైతులకు కాంగ్రెస్ పంటల బోనస్ ఇస్తామని అన్నది? వానకాలం పంటకు వచ్చిందా? అంటే లేదు.. అని బదులిచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన దానిని త్వరలోనే టీవీల్లో చెబుతా.. అని అన్నప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే ఇప్పటికే దేశంలో అగ్గిపెట్టే వాళ్లమని కేసీఆర్ అన్నప్పుడు సభికులు సందడి చేశారు.
బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు బెదిరిస్తున్నారని, వారికి రాజకీయాలు ఎందుకంటూ? కేసీఆర్ అన్నప్పుడు ప్రజలు ఈలలు వేశారు.
తాము కూడా ఇలాగే పోలీసులతో దౌర్జన్యాలు చేయిస్తే కాంగ్రెస్ నాయకులు మిగిలేవారా? అని ప్రశ్నించినప్పుడూ విశేష స్పందన వచ్చింది.
వేదికపై కేసీఆర్కు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు గదను బహూకరించారు
సభకు చొప్పదండి, సిరిసిల్ల, హుస్నాబాద్, వేములవాడ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.
ఈద్గా వద్ద ఏర్పాటుచేసిన పారింగ్ స్థలం బస్సులు, లారీలు, ఆటోలతో నిండిపోయింది. జ్యోతినగర్, నందిని స్కూల్ వీధుల్లో సైతం వాహనాలను నిలిపారు.
డప్పుచప్పుళ్ల నడుమ నృత్యాలు చేస్తూ, పలు ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఉత్సాహంగా సభాస్థలికి ర్యాలీలుగా చేరుకున్నారు.
సభ ప్రారంభానికి ముందు కళాకారులు మాటపాటలతో ప్రజలను హోరెత్తించారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాంగ్రెస్, బీజేపీలను విమర్శిస్తూ సాగించిన పాటలకు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది.
కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 12: కరీంనగర్లోని కదనభేరి సభ కోసం హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్లో బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయంత్రం 5.35 గంటలకు శాతవాహన యూనివర్సిటీలోని హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా నగరంలోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసానికి వెళ్లారు. అక్కడే టీ, స్నాక్స్ స్వీకరించారు.
2001లో ఇదే ఎస్సారార్ కళాశాల వేదికగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి విజయం సాధించిన్రు. ఇప్పుడు ఇదే వేదికగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మరోసారి బీఆర్ఎస్ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నరు. కేసీఆర్ అడుగు పెట్టగానే ఈ నేల పులకరించింది. బండి సంజయ్కి.. వినోద్కుమార్కు చాలా వ్యత్యాసం ఉన్నది. వినోద్కుమార్ను గెలిపించుకుంటేనే కరీంనగర్ అభివృద్ధి జరుగుతుంది.
– గంగుల కమలాకర్, ఎమ్మెల్యే, కరీంనగర్