కరీంనగర్: కరీంనగర్ జిల్లా అన్ని కులాలు, మతాలకు వేదికని, నగర ప్రజలంతా కలిసిమెలసి జీవిస్తున్నారని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు. గురువారం కరీంనగర్ సింధి భవన్లో నిర్వహించిన సింధ్ కులస్థుల ఆరాధ్య దైవం చీటీ చంద్ జూలే లాల్ జయంతి( Julelal Birth Anniversary) వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జూలే లాల్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు(Law and Other) అదుపులో ఉన్నాయని వెల్లడించారు. గత 15 సంవత్సరాలుగా నగరంలో 144 సెక్షన్లు , కర్ఫ్యూలు, అల్లర్లు, చందాలు, దందాలు లేవని పేర్కొన్నారు.
సింధ్ కమ్యూనిటీ హాల్ కు ప్రభుత్వ భూమి తో పాటు రూ. 60లక్షల నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, కార్పొరేటర్లు పిట్టల వినోదాశ్రీనివాస్, వంగల శ్రీదేవి, తోట రాములు, ఏవీ రమణ, ప్రేమ్ కుమార్ ముందడా,అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, సుడా డైరెక్టర్ నేతి రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.