కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి లో రూ. 65 లక్షలతో డి 87న కెనాల్ నుంచి రాజసముద్రం చెరువు నింపడానికి కెనాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్కాకతీయ తో చెరువులకు పునర్జీవనం వచ్చిందని , బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయని వెల్లడించారు. సమైక్యాంధ్రలో రైతు ఆత్మహత్యలు, నీటి యుద్ధాలు జరిగేవని గుర్తు చేశారు. కాళేశ్వరం జలాలతో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ కులవృత్తులకు జీవం పోసారని అన్నారు.
భూగర్భ జలాలు పెంచేందుకు మానేరు వాగు పై ఐదు, ఇరుకుల్ల వాగు పై నాలుగు చెక్ డ్యామ్ లు నిర్మించామని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో హైదరాబాదుకు పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఢిల్లీ ఆంధ్ర పాలకులు తెలంగాణపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
సాధించుకున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటసీపీ పురమల్ల లలితాశ్రీనివాస్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీ ఐలయ్య, జక్కం నర్సయ్య, మడికంటి మారుతీ, జువ్వా డి రాజేశ్వర్ రావు, పంది తిరుపతి యాదవ్, కూర నరేష్ రెడ్డి పాల్గొన్నారు.