HomeTelanganaKantivelugu Camps Are Continuing Successfully
దగ్గరి చూపు సమస్యలే ఎక్కువ
రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. రోజుకు సగటున 2 లక్షల మందికిపైగా పరీక్షలు చేయించుకుంటున్నారు.
‘కంటివెలుగు’ లబ్ధిదారుల్లో వారే అధికం
ప్రతి ముగ్గురిలో ఒకరికి దృష్టిలోపం
50 ఏండ్లు దాటినవారిలో కాటరాక్ట్ సమస్యలు
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. రోజుకు సగటున 2 లక్షల మందికిపైగా పరీక్షలు చేయించుకుంటున్నారు. బాధితుల సమాచారాన్ని విశ్లేషిస్తే, అనేక ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.
30 రోజుల్లో సుమారు 64.83 లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 19.48 లక్షల మందికి కండ్లద్దాలు అవసరమని గుర్తించారు. అంటే, దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరికి దృష్టిలోపాలు ఉన్నట్టు తేలింది.
బాధితుల్లో దగ్గరిచూపు కనిపించక ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 40 ఏండ్లకు పైబడిన వారిలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు చెప్తున్నారు.
కంటివెలుగులో ఇప్పటివరకు 19.48 లక్షల మందికి కండ్లద్దాలు అవసరమని గుర్తించగా, 11.40 లక్షల మంది రీడింగ్ గ్లాసెస్ అవసరం ఉన్నవారే. అంటే బాధితుల్లో సుమారు 60 శాతం మంది దగ్గరి చూపుతో బాధపడుతున్నట్టే.
50 ఏండ్లకు పైబడి శిబిరాలకు హాజరవుతున్న వారిలో అత్యధిక శాతం మందికి కాటరాక్ట్ (మోతెబిందు) సమస్యలు ఉన్నట్టు సిబ్బంది గుర్తిస్తున్నారు. వారిలో అవసరమైన వారికి శస్త్రచికిత్సకు రెఫర్ చేస్తున్నారు.
సాధారణ కంటి సమస్యలతో వస్తున్న వారికి చుకల మందులతో పాటు విటమిన్ ఏ, డీ, బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు.
ఇప్పటివరకు పరీక్షించిన వారిలో 44.33 శాతం మందికి ఎలాంటి దృష్టిలోపాలు లేకపోవడం శుభ పరిణామం.
రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం గ్రామ పంచాయతీల్లో కంటివెలుగు శిబిరాలు పూర్తయ్యాయి. అంటే, ఆయా గ్రామాల్లో నివారించదగిన అంధత్వ లోపానికి దాదాపు తెరపడినట్టే.
పట్టణాల్లోనూ 41 శాతం వార్డుల్లో క్యాంపులు పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల్లో దృష్టిలోపాలతో బాధపడుతున్నవారందరికీ పరిష్కారం లభించింది.
కంటి వెలుగులో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. 63.82 లక్షల మంది లబ్ధిపొందారు. ఇప్పటివరకు 30 రోజులు శిబిరాలు కొనసాగాయి. అంటే, 30 శాతం పనిదినాలు పూర్తయ్యేలోగానే 42 శాతం మందికి కంటి పరీక్షలు జరిగాయి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కన్నా వేగంగా శిబిరాలు పూర్తయ్యే అవకాశం ఉన్నది.