హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ప్రపం చ రికార్డు లక్ష్యంగా ప్రారంభమైన కంటివెలుగు కార్యక్రమం రెట్టింపు జోష్తో కొనసాగుతున్నది. 48 రోజుల్లో కంటి పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య దాదాపు 98 లక్షలుగా నమోదైంది. ఈ లెక్కన మంగళవారం లేదా బుధవారంతో స్క్రీనింగ్ కోటి మార్క్ దాటనున్నది. ఇప్పటివరకు 6,713 గ్రామపంచాయతీలు (52.49 శాతం), 2,247 పట్టణ వార్డుల్లో (65.13 శాతం) స్క్రీనింగ్ పూర్తయింది.
మరో 1500 ప్రాంతాల్లో కంటి శిబిరాలు కొనసాగుతున్నాయి.
కంటి పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే శిబిరాలు ఏర్పాటు చేస్తుండటంతో మహిళల నుంచి స్పందన ఎక్కువగా ఉన్నది. ఇప్పటివరకు స్క్రీనింగ్ చేసుకున్నవారిలో పురుషులు 45.95 లక్షల మంది ఉండగా, మహిళలు 51.90 లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. దాదాపు ఆరు లక్షలు అధికంగా ఉన్నారు. 3,226 మంది ట్రాన్స్జెండర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. కంటిపరీక్షలు చేయించుకున్నవారిలో 71.63 శాతం మందికి ఎలాంటి దృష్టిలోపాలు లేవని తేలింది. ప్రతి పది మందిలో ముగ్గురికి మాత్రమే సమస్యలు ఉన్నట్టు తేలుతున్నది.