హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రెండో విడత కంటివెలుగులో భాగంగా జర్నలిస్టులు, పోలీసులు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. కంటివెలుగు కార్యక్రమం అమలు తీరుపై శనివారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్ నుంచి కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బఫర్ టీమ్స్ను ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కోర్టు భవన సముదాయాలు, పోలీస్ బెటాలియన్లు, ప్రెస్క్లబ్ల వద్ద కంటివెలుగు క్యాంపులు నిర్వహించాలని సూచించారు. కంటి అద్దాల నిల్వలను కలెక్టర్లు సరి చూసుకోవాలని ఆదేశించారు. మొదటి రెండ్రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన 97,335 మందికి కండ్లద్దాలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. కంటి వెలుగు నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మొహంతి పాల్గొన్నారు.